వారెవ్వా క్యా సీన్ హై : పొత్తుల్లో ట్విస్టులు.. లాల్ జెండా నీడలోనా కారు..!
Recommended Video
నల్గొండ : వారెవ్వా క్యా సీన్ హై అని అనిపించేలా హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కొన్ని పార్టీలు కొత్త పొత్తుల రాగం అందుకున్నాయి. దాంతో హుజుర్నగర్ బై పోల్స్ రాజకీయం వేడెక్కింది. పొత్తుల్లో ట్విస్టులెన్నో కనబడటంతో ఓటర్లు పరేషాన్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ సపోర్ట్ ఇస్తుండగా.. కాంగ్రెస్ పార్టీకేమో తెలంగాణ జన సమితి మద్దతు పలికింది.
ఈ నేపథ్యంలో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆ పార్టీ నేతల నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. ఇక ఇండిపెండెంట్లతో తమకు ముప్పుందని భావిస్తున్న ప్రధాన పార్టీల నేతలు వారిని బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి నామినేషన్ల ఉప సంహరణ తర్వాత బరిలో ఎవరు ఉండబోతున్నారో.. ఎవరు ఎవరికి సపోర్ట్ ఇస్తారో తేలనుంది.
నిజామాబాద్ను తలదన్నేలా.. లాల్ జెండా నీడలోనా కారు..!
హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక నిజామాబాద్ పార్లమెంటరీ స్థానానికి జరిగిన ఎంపీ ఎన్నికలను తలపిస్తోంది. సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా వందకు పైగా రైతులు నామినేషన్లు దాఖలు చేసి బరిలో నిలవడంతో చివరికి బీజేపీ అభ్యర్థి గెలుపు ఈజీ అయింది. అదే క్రమంలో తాజాగా హుజుర్నగర్ ఉప ఎన్నిక నిజామాబాద్ ఎంపీ ఎన్నికలను తలదన్నేలా కనిపిస్తోంది. ఇక్కడ కూడా అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో అధికార పార్టీ టీఆర్ఎస్లో కలవరం మొదలైనట్లు టాక్ నడుస్తోంది.
ఆ క్రమంలో సీపీఐతో పొత్తుకు సిద్ధమయ్యారు టీఆర్ఎస్ నేతలు. ఆ మేరకు పార్టీ నేతలతో చర్చించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి గులాబీకే జై కొట్టారు. హుజుర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో సీపీఐకి 5 నుంచి 6 వేల ఓటు బ్యాంక్ ఉందనేది ఒక అంచనా. అందుకే ఏ చిన్న అవకాశాన్ని మిస్ చేసుకోవద్దనే ఉద్దేశంతో సీపీఐతో పొత్తుకు టీఆర్ఎస్ సై అన్నట్లుగా తెలుస్తోంది.
టీఆర్ఎస్ జోరుపై బీజేపీ కన్ను.. కోల్బెల్ట్ ఏరియాలో కిషన్ రెడ్డి కొత్త మార్క్ పాలిటిక్స్
హుజుర్నగర్లో మరోసారి విజయం కోసం టీజేఎస్తో పొత్తు
కాంగ్రెస్ కంచుకోటగా ముద్ర పడ్డ హుజుర్నగర్లో మరోసారి విజయం సాధించే దిశగా కాంగ్రెస్ నేతలు శాయశక్తులా శ్రమిస్తున్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం హుజుర్నగర్ ఉప ఎన్నిక కోసం పనిచేయడానికి సిద్ధమైంది. ఇదివరకున్న అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గెలుపుపై ధీమాతో ఉన్నా.. విజయం కోసం ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రయత్నిస్తున్నారు పార్టీ పెద్దలు.
ఆ క్రమంలో తెలంగాణ జన సమితితో పొత్తుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. టీజేఎస్ మద్దతుతో తమ బలం మరింత పెరుగుతుందనేది కాంగ్రెస్ లీడర్ల ఆలోచనగా కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు తెలంగాణ జన సమితి తీసుకున్న నిర్ణయం హస్తం గుర్తుకు కలిసొస్తుందని భావిస్తున్నారు.
ఒంటరి పోరులో బీజేపీ, టీడీపీ
హుజుర్నగర్ ఉప ఎన్నికను అధికార పక్షమైన టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ రెండు పార్టీల మధ్యే ప్రధాన యుద్ధం కొనసాగనుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇటు బీజేపీ, అటు టీడీపీ కదన రంగంలో ఒంటరి పోరు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి అంతో ఇంతో బలమైన క్యాడర్ ఉండేది. ఆ క్రమంలోనే హుజుర్ నగర్ ఉప ఎన్నికకు సై అంది. తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం తీసుకు రావడానికే ఈ ఎన్నికలో పోటీ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ప్రకటించడం కొత్త పొలిటికల్ ఈక్వేషన్కు దారి తీసినట్లైంది. ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుని పోటీకి రెడీ అయింది.
సచివాలయం కూల్చివేయొద్దు.. సర్కార్ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్..!
అటు ఇటైతే కొంప కొల్లేరే.. అందుకే ఇండిపెండెంట్లకు గాలం..!
గత ఎన్నికల సమయంలో కొందరు ఇండిపెండెంట్ల కారణంగా ప్రధాన పార్టీల పునాదులు కదిలాయి. టీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బ కొట్టడం.. కాంగ్రెస్ మెజార్టీకి గండి పడటం.. తదితర అంశాలు ఇండిపెండెంట్ల సత్తాను చాటాయి. ఆ క్రమంలో ఈసారి బలమైన ఇండిపెండెంట్లను గుర్తించి బుజ్జగించే పనిలో పడ్డారు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు. హుజుర్నగర్ ఉప ఎన్నిక రాష్ట్రమంతటా చర్చానీయాంశంగా మారడంతో ఇక్కడ ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నామినేషన్ల ఉప సంహరణ గడువు గురువారం (03.10.2019) నాటికి ముగియనుండటంతో ఎంతమంది బరిలో నిలుస్తారనేది సాయంత్రం కల్లా తేలనుంది.