ఎన్నికల కోడ్ ఉల్లంఘన: ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ ఇంట్లో ప్రెస్మీట్ నిర్వహించినందుకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎంసీసీ టీం పెంటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రచారం పర్వం శనివారం నాటికే ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించినట్లు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయటకు పంపించాలని టీఆర్ఎస్ కోరింది. కోదాడకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల నిబంధనలకు ఆదివారం హుజూర్నగర్లో ప్రెస్ మీట్ నిర్వహించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటు కూడా కోదాడ నియోజకవర్గం పరిధిలో ఉండటం గమనార్హం. ఎన్నికలు జరిగే నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు కానివారు 24గంటలకు ముందు నుంచే ఆ నియోజకవర్గ పరిధిలో ఉండకూడదని ఎన్నికల కోడ్ పేర్కొంటోంది.
తెలంగాణ అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. పద్మావతిని గెలిపించుకునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బాగానే ప్రచారం చేశారు.