ఉత్కంఠకు తెర: మరికొద్ది గంటల్లో హుజూర్నగర్ ఉపఎన్నిక ఫలితాలు
హైదరాబాద్: హుజూర్నగర్ ఉపఎన్నిక ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈ సోమవారం హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ ఉపఎన్నికలను కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి బరిలో ఉన్నారు.
ఈ ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు మొత్తం 28మంది అభ్యర్థులు హుజూర్నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2018లో హుజూర్నగర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.
కాంగ్రెస్ తమ స్థానాన్ని దక్కించుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఈ స్థానాన్ని దక్కించుకుని తెలంగాణలో తమకు తిరుగులేదని చాటుకోవాలని గట్టిగానే ప్రయత్నించింది.
ఇక టీడీపీ, బీజేపీ అభ్యర్థులు కూడా ఈ ఉప ఎన్నిక బరిలో దిగి తమ బలాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నించాయి. అయితే, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. ఈ స్థానం నుంచి ఎవరు విజేతలుగా నిలుస్తారో గురువారం(అక్టోబర్ 24న) తేలనుంది. కాగా, తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హుజూర్ నగర్ ఉపఎన్నికకు ప్రాధాన్యత సంతరించుకుంది.