హుజూర్ నగర్ పోరు .. టీఆర్ఎస్ కు మద్దతుపై సీపీఐ యూటర్న్ బాంబ్ ?
తెలంగాణా రాష్ట్రంలో సీపీఐ తాజా పరిణామాల నేపధ్యంలో అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న సీపీఐ యూ టర్న్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది . హుజూర్ నగర్ ఎన్నికల్లో అధికార పార్టీకి తమ మద్దతు ప్రకటించిన సీపీఐ నేతలు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ఆత్మ పరిశీలనలో పడ్డారు. అందుకే ఇప్పటికైనా కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉండాలని లేని యెడల అధికార పార్టీకి మద్దతుపై పునరాలోచిస్తామని సంకేతాలిస్తున్నారు. మొదటి నుండి కార్మిక పక్షపాతిగా ఉన్న సీపీఐ నేతలు ఆర్టీసీ కార్మికులకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక హుజూర్ నగర్ ఎన్నికల్లో మద్దతు రాజకీయ అవసరం అని ముందు పేర్కొన్నప్పటికీ ఇప్పుడు మాత్రంఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో యూటర్న్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మద్దతు ఉపసంహరించుకునే ఆలోచనలో సీపీఐ
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు ముందే మద్దతు ప్రకటించిన సీపీఐకి హుజూర్ నగర్ ఉప ఎన్నికల విషయంలో అధికార టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి తప్పు చేశామని అర్ధం అయ్యినట్టుంది. అందుకే సీపీఐ తన మద్దతు కార్మికుల విషయంలో ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే ఉప సంహరించుకునే ఆలోచనలో ఉంది. సీపీఐ టీఆర్ఎస్ కు ఇచ్చిన ఈ మద్దతుపై పునరాలోచన చేయనుంది.
టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచిస్తామన్న చాడా వెంకట్ రెడ్డి
తెలంగాణలో ఐదు రోజుల నుంచి కొనసాగుతున్న టీఎస్సార్టీసీ సమ్మెకు సీపీఐ మద్దతు ప్రకటించింది. సమ్మె విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచన చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. సమ్మెలో భాగంగా నేడు సీపీఐ ఆధ్వర్యంలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి నిరసన తెలుపుతామని చెప్పారు .
కేసీఆర్ కు అల్టిమేటం .. నేడు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు
ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వానిది నిరంకుశ విధానం అని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం సమంజసం కాదని ఆయన అన్నారు. మరోపక్క హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించింది సిపిఐ. ప్రస్తుత పరిస్థితుల్లో హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడాన్ని, ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ముడిపెట్టవద్దని సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి పేర్కొన్నప్పటికీ ఇప్పుడు పార్టీ మరోమారు అంతర్మధనంలో పడింది. అందుకే సీఎం కేసీఆర్ కు అల్టిమేటం జారీ చేస్తుంది.
ఆర్టీసీ కార్మికుల విషయంలోనే ఉప ఎన్నికల మద్దతుపై సీపీఐ యూటర్న్ ఆలోచన
అసలే హుజూర్ నగర్ ఎన్నికల బరిలో ఈదుతున్న గులాబీ బాస్ కు సీపీఐ షాక్ ఇస్తే హుజూర్ నగర్ పోరులో టీఆర్ఎస్ ఇబ్బంది పడటం పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఊహించని పరిణామంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు మద్దతు ప్రకటించిన సీపీఐ సైతం సిద్ధం అయ్యింది. అందుకే యూ టర్న్ తీసుకుంటామని బాంబ్ వేసి మరీ గులాబీ బాస్ మెడలు వంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ సీపీఐ డిమాండ్ కు టీఆర్ ఎస్ తలొగ్గకుంటే మద్దతు ఉపసంహరించుకుంటారా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశం గా మారింది.