హుజూర్ నగర్ ఫలితం ... టీఆర్ఎస్ దూకుడు .. టెన్షన్ లో కాంగ్రెస్
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం నేడు తేలనుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా భావించిన హుజూర్ నగర్ లో కారు దూసుకుపోతుందేమో అన్న భయం కాంగ్రెస్ శ్రేణులను కౌంటింగ్ ఆరంభం నుంచే వేధిస్తోంది.
సిట్టింగ్ స్థానాన్ని పణంగా పెట్టిన కాంగ్రెస్
హుజూర్ నగర్ ఉప ఎన్నికలు... అటు అధికార టిఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడిన ఉప ఎన్నికలు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్యనే పోటీ నెలకొంది. ఎందుకంటే గత ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయకేతనం ఎగురవేశాడు. ఎంపీ ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొందడంతో హుజూర్ నగర్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. చేజేతులారా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని పణంగా పెట్టింది.
పోలింగ్ ముందు వరకు కచ్చితంగా గెలుస్తామన్న ధీమాలో కాంగ్రెస్
ఎలాగైనా హుజూర్ నగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ,సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడ్డారు.ఎవరికివారు వ్యూహాలు ప్రతివ్యూహాలతో హుజూర్ నగర్ ఓటర్ల మనసు గెలుచుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే హుజూర్ నగర్ లో ఓటర్ల తీర్పు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీకి ప్రతికూలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగానే నమ్మారు. అంతేకాదు ఆర్టీసీ కార్మికుల సమ్మె కాంగ్రెస్ పార్టీ నాయకులకు హుజూర్ నగర్ ఎన్నికల విషయంలో కలిసొచ్చే అంశం అని కూడా భావించారు.
హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ హవా .. ముందే చెప్పిన ఎగ్జిట్ పోల్స్
హుజూర్ నగర్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు హుజూర్ నగర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని,ఈసారి కూడా ఆదరిస్తారని గట్టిగా నమ్మారు. కానీ హుజూర్ నగర్ పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ అంచనాలను తలకిందులు చేశాయి. ఓటర్లు టిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టనున్నారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చే సాయి. ఇక నేడు కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి దూకుడు కొనసాగిస్తున్నారు. ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ టెన్షన్ లో పడింది.
ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్
ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తే రాష్ట్రంలో కాస్త కాంగ్రెస్ పార్టీ పరువు నిలబడుతుంది. లేదంటే ఇప్పటికే గత ఎన్నికల ఫలితాలతో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి, మరోమారు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఒకవేళ ఓటమి పాలైతే అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి అనుకున్న ప్రతిసారి హుజూర్ నగర్ లో ఓటమిని గులాబీ శ్రేణులు గుర్తు చేస్తాయి. అంతేకాకుండా ఇంతవరకు ఊహించని ఫలితం హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో వస్తే అది కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా పెద్ద మైనస్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ శ్రేణులు, హుజూర్ నగర్ ఫలితాల పైన బాగా టెన్షన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.