హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ కు దిమ్మ తిరగాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతున్న తరుణంలో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది. ఒక పక్క ఎన్నికల ప్రచారం సాగిస్తూనే మరోపక్క ఆర్టీసీ కార్మికులపై టీఆర్ ఎస్ అధినేత తీరును తూర్పార పడుతుంది కాంగ్రెస్. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ కు దిమ్మ తిరగాలని ఆయన పిలుపునిచ్చారు . కేసీఆర్ నిరంకుశ విధానాలపై పోరాటం చెయ్యటానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఆయుధంగా చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వైఖరిని, విధానాన్ని టిపిసిసి అధ్యక్షుడు, నల్గొండ ఎంపి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
కేసీఆర్ ది బాధ్యతా రాహిత్యం అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజుర్నగర్ ఉప ఎన్నికల నేపధ్యంలో మట్టంపల్లి మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కెసిఆర్ను అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తించే , స్పృహలేని ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిని ఆత్మహత్యకు గురిచేసింది కేసీఆర్ అహంకారమేనని ఆయన అన్నారు. ఆర్టీసీ యూనియన్లు నిబంధనల ప్రకారం సమ్మె నోటీసును అందించినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ఆయన అన్నారు.
ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ ది క్రూరత్వం
ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగినప్పుడు, ముఖ్యమంత్రి స్పందన దారుణం అని ఆయన అన్నారు. 48,000 మందికి పైగా ఉద్యోగులను ఒకే వేటుతో తొలగిస్తున్నట్లు ప్రకటించారని మండిపడ్డారు . వారి గత నెల జీతాలను కూడా నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరియు వారికి ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స కూడా నిరాకరించటం హేయం అని పేర్కొన్నారు.కెసిఆర్ యొక్క క్రూరత్వం మరియు నియంతృత్వ వైఖరి ఉద్యోగులలో అభద్రత మరియు నిస్సహాయతను , భయాన్ని కలిగించిందని పేర్కొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి .
అత్మబలిదానాలకు కేసీఆర్ కారణం అని కాంగ్రెస్ నాయకుల మండిపాటు
ఫలితంగా ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలకు సిద్ధం అవుతున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సానుభూతి లేకుండా , కెసిఆర్ తన తప్పుడు అహాన్ని తీర్చడానికి మొండి వైఖరిని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు . ఈ ప్రవర్తన తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు "అని ఆయన అన్నారు. ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్ష పార్టీలను నిందించిన టిఆర్ఎస్ మంత్రులపై ఆయన విరుచుకుపడ్డారు .
ఉద్యోగులపై బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్
ఆర్టీసీ ఉద్యోగులను కలవడానికి లేదా చర్చించడానికి ముఖ్యమంత్రి సుముఖంగా లేరని, వారి సమస్యలను పరిష్కరించడానికి మంత్రులకు అధికారం లేదని ఉత్తమ్ అన్నారు. ఇది ప్రతి పౌరుడికి హక్కులు ఉన్న ప్రజాస్వామ్యం, గౌరవంగా వ్యవహరించాలన్నారు . ముఖ్యమంత్రి మరియు మంత్రులు ప్రతిరోజూ ఆర్టీసీ ఉద్యోగులను వారి ఇబ్బందికర ప్రకటనలతో అవమానిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మరియు ఆర్టీసీ ఉద్యోగులు బానిసలుగా పని చెయ్యాలని వారు కోరుకుంటున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
టీఆర్ఎస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి సహకారాన్ని ప్రకటించిన ఆయన, ఎటువంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. సంతోషంగా ఎవరు ఉన్నారో చూపించాలని ఉత్తర్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులను సవాలు చేశారు. టిఆర్ఎస్ పాలనలో 4 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ముఖ్యమంత్రికి అవేవీ పట్టటం లేదని వ్యాఖ్యానించారు . పంట రుణ మాఫీ రూ. 1 లక్ష ఇంకా అమలు కాలేదని పేర్కొన్నారు . దాదాపు 50% మంది రైతులకు రైతు బంధు మొత్తం రాలేదని, యూరియా కొరత కారణంగా లక్షలాది మంది రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. కెసిఆర్ ఇప్పటికైనా వాస్తవికతను అంగీకరించాలని పేర్కొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి .