ఎగ్జిట్ పోల్స్ లో హుజూర్ లో కారు జోరు: ఆర్టీసీ..పొలిటికల్ జేఏసీ బేజారు: అదే జరిగితే..!
తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అందులో కారు జోరు ఖాయమని అంచనాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇది..తెలంగాణ అధికార పార్టీకి ఎంత జోష్ ఇచ్చిందో కానీ.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కారు స్పీడ్ కు బ్రేకులు పడతాయని అంచనా వేసారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి వ్యవహార శైలి ప్రజల్లో వ్యతిరేకత పెంచిందనే అంచనాతో ప్రతిపక్ష పార్టీలు సైతం తమకు పట్టు దొరికిందని భావించాయి. ఇక, హుజూర్ నగర్ లో సైతం అధికార పార్టీని ఓడిస్తే..ఇదే దూకుడు కొనసాగించాలనే అంచనాల్లో ఉన్నాయి.
అయితే.. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల జీతాలకే డబ్బులు లేవంటూ కోర్టులో వాదించిన ప్రభుత్వం..ఇక ఇప్పుడు ప్రజల్లో సైతం అనుకూల తీర్పు వస్తే జేఏసీ నేతల డిమాండ్లకు ఒప్పుకొనే పరిస్థితి ఏ మాత్రం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పుడు ప్రజలు తమ నిర్ణయాలను..పాలనను సమర్ధిస్తున్నారని చెప్పకొనే వెసులుబాటు అధికార పార్టీకి ఏర్పడుతోంది. దీంతో..ఈ ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా..అదే జరిగితే ఇక అధికార పార్టీని అడ్డుకోగలమా అనేదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిస్కషన్.
ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్వైపే
రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలు హుజూర్ నగర్ ఉప ఎన్నిక పైన ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా.. అన్ని ఫలితాలూ అధికార టీఆర్ఎ్సకు అనుకూలంగానే ఉన్నాయి. చాణక్య ఎగ్జిట్ పోల్లో టీఆర్ఎ్సకు 53 శాతం, కాంగ్రె్సకు 41 శాతం, టీడీపీకి 2.1 శాతం, బీజేపీకి 1.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
ఆరా అనే ఏజెన్సీ చేసిన సర్వేలో టీఆర్ఎ్సకు 50.48 శాతం, కాంగ్రె్సకు 39.95 శాతం, ఇతరులకు 9.57 శాతం ఓట్లు పోల్ అవుతాయని పేర్కొంది. ‘వీసీపీ' అనే సంస్థ టీఆర్ఎ్సకు 57.73 శాతం, కాంగ్రె్సకు 41.04 శాతం, టీడీపీకి 2.21 శాతం, బీజేపీకి 1.17 శాతం, ఇతరులకు 1.84 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రిసెర్చ్ అండ్ అనాలసిస్ బై పబ్లిక్ పల్స్ అనే సంస్థ టీఆర్ఎ్సకు 49.3%, కాంగ్రె్సకు 41.8%, టీడీపీకి 4.8%, బీజేపీకి 2.4%, ఇతరులకు 1.7% వస్తాయని పేర్కొంది. దీంతో పాటుగా ఈ అంచనాలు రాక ముందే మంత్రి కేటీఆర్ తమ పార్టీ గెలుపు ఖాయమని ట్వీట్ చేసారు.
అదే అంచనాలు నిజమైతే..
ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయి. ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేసాయి. సీపీఐ ఇచ్చిన మద్దతు ఉప సంహరించుకుంది. ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఖరి పైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రాజకీయ పార్టీలు అంచనా వేసాయి. దీంతో..ఆర్టీసీ జేఏసీ నేతలకు మద్దతుగా నిలిచి బంద్ తో పాటుగా కాంగ్రెస్ ఛలో ప్రగతి భవన్ నిర్వహించింది. హుజూర్ నగర్ ఉన ఎన్నిక లో అధికార పార్టీని ఓడిస్తే..రాజకీయంగా తమకు పట్టు లభిస్తుందని ప్రతిపక్షాలు అంచనా వేసాయి. ఆర్టీసీ జేఏసీ సైతం అక్కడ అధికార పార్టీ ఓడితే ప్రజలు తమకు మద్దతుగా నిలిచి..ప్రభుత్వానికి హెచ్చరిక చేసారని చెప్పుకొనే వెసులుబాటు కలుగుతుందని భావించింది.
పైకి రాజకీయాలతో తమకు సంబంధం లేదని చెబుతున్నా..రాజకీయ పార్టీల మద్దతుతోనే సమ్మె కొనసాగుతోంది. అయితే, అధికార పార్టీ మాత్రం తమకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ..ప్రతిపక్ష పార్టీలతో సహా తమను ఇబ్బంది పెడుతున్నారనే కారణంతో ఆర్టీసీ జేఏసీ పైన పట్టు సడలకూడదని భావిస్తోంది. అందు కోసమే ప్రతిపక్షాలన్నీ ఆర్టీసీ సమ్మె మీద ఫోకస్ చేయగా..అధికార పార్టీ మాత్రం పూర్తిగా ఎన్నికల మీదే ఫోకస్ పెట్టింది.
ఇక..కేసీఆర్ కు మరింత బలం..
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే ముఖ్యమంత్రి రాజకీయంగా మరింత బలం పొందటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే మరో రాజకీయ పార్టీకి అవకాశం ఏకుండా ఏకపక్షంగా అధికార పార్టీ హవా కొనసాగిస్తోంది. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని ప్రచారం జరిగిన సమయంలోనూ..అధికార పార్టీ గెలిస్తే అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి బలం ఇచ్చే అంశమే. అయితే, గతం ఎన్నికల్లో ట్రాక్టర్ గుర్తు కారణంగా సైదిరెడ్డి ఓడిపోయారనే సానుభూతి పని చేసి ఆయన వైపు ఓటర్లు మొగ్గు చూపినట్లుగా ఎగ్జిట్ పోల్స్ చూస్తూ అర్దం అవుతుందనే విశ్లేషణలు ఉన్నాయి.
అయితే, ఆర్టీసీ సమ్మె విషషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని ముఖ్యమంత్రి వారికి సెప్టెంబర్ జీతాలు ఇవ్వటానికి సైతం డబ్బులు లేవని ఆర్టీసీ యాజమాన్యం ద్వారా కోర్టుకు స్పష్టం చేసారు. మరి..ఇక, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల విషయంలో కోర్టు లేదా గవర్నర్ ద్వారా మాత్రమే ప్రభుత్వం పరిష్కారం చూపించే అవకాశం కనిపిస్తోంది.