lockdown:పోలీసు అధికారిలో పరిమళించిన మానవత్వం, ఫోన్ చేస్తే ఆస్పత్రికి తీసుకెళ్లి, 20 వేలు కట్టి...
కరోనా వైరస్ ప్రభావం చూపుతోన్న వేళ ఓ పోలీసు అధికారి మానవత్వం చాటుకున్నారు. ఒకతనికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెంటనే స్పందించారు. ఆస్పత్రికి తీసుకెళ్లడమే గాక బిల్లు కూడా కట్టారు. విషయం తెలిసిన సీఎంలు, డీజీపీ ఆ పోలీసు అధికారిని ప్రశంసించారు. కూకట్ పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ చేసిన మంచి పనిని అందరూ కొనియాడుతున్నారు.
ఫోన్ చేయడంతో...
లాక్ డౌన్ వల్ల ఎక్కడివారు అక్కడే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్కి చెందిన లలిత్ కుమార్ హైదరాబాద్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఈ నెల 16వ తేదీన అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే కోవిడ్-19 హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేశాడు. వారు డీజీపీ కార్యాలయానికి కనెక్ట్ చేయగా.. కూకట్ పల్లి పోలీసు స్టేషన్కు పరిధిలో కావడంతో అక్కడి స్టేషన్ ఆఫీసర్ను అలర్ట్ చేశారు. వెంటనే ఘటనాస్థలానికి ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణ చేరుకున్నారు.
రూ.20 వేలు కట్టి
లలిత్ కుమార్ పరిస్థితి చూసి ఆస్పత్రికి తరలించారు. అతనికి అత్యవసరంగా వైద్యం అందించాల్సి వచ్చింది. అయితే సర్జరీ కోసం రూ.20 వేలు కట్టాలని సిబ్బంది కోరారు. దీంతో లక్ష్మీనారాయణ తన సొంత డబ్బులను లలిత్ వైద్యం కోసం కట్టారు. అతను డిశ్చార్జ్ అయ్యేవరకు జాగ్రత్తగా చూసుకున్నారు. దీనిపై లక్ష్మీనారాయణ చాలా సింపుల్గా స్పందించారు. ఆపత్కాలంలో ఉన్న యువకుడికి సాయం చేశానని.. అది చిన్నసాయం అని పేర్కొన్నారు. ఒకరి ప్రాణం నిలబెట్టేముందు డబ్బులు ముఖ్యం కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం లలిత్ కుమార్ బాగున్నాడని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రశంసలు
లక్ష్మీనారాయణ చేసిన మంచి పనిని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. ఈ మేరకు ఆయనకు లేఖ కూడా చేశారు. ఆపదలో ఉన్న యువకుడిని ఆస్పత్రిలో చేర్చడమే కాక.. రూ.20 వేల సాయం కూడా చేశారని పేర్కొన్నారు. మీరు చేసిన మంచి పని సదా ప్రశంసనీయం అని కేసీఆర్ కొనియాడారు. మిగతా పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసలతో ముంచెత్తారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ కూడా లక్ష్మీనారాయణ చేసి మంచిపనిని కొనియాడారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నత అధికారులు కూడా ప్రశంసించారు.
Recommended Video