పక్కకు రమ్మని తీసుకెళ్తుంది.. విషయమేంటో అనుకుని వెళ్తే ఇలా 'చుక్కలే'
అమాయకులకు వలవేసి అందినకాడికి దోచుకెళ్తున్న వీరిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: వాళ్లిద్దరూ భార్యాభర్తలు. అంతకుమించి మంచి తోడు దొంగలు. టార్గెట్ చేసిన వ్యక్తిని భార్య ఎటాక్ చేస్తే.. భర్త చివరలో వచ్చి సీన్ రక్తి కట్టిస్తాడు. వీళ్లిద్దరి యాగీకి జేబులు గుల్ల చేసుకున్న అమాయకులు నగరంలో చాలామందే ఉన్నారు. ఇటీవలే పోలీసులు వీరి ఆట కట్టించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకలోని బల్క్ నుంచి నగరానికి వలస వచ్చిన మహిళ అయేషా (25) మత్తుకు బానిసైంది. గతేడాది నగరానికి చెందిన సాజిద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తరుచుగా తమ నివాసాన్ని మార్చడం వీరికి అలవాటైపోయింది. ఇద్దరూ ఏ పని చేయరు.. రోడ్ల మీద పడి అమాయకులను నిలువు దోపిడీ చేస్తుంటారు.
ముందుగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చే అయేషా.. రోడ్డెంట వెళ్లే పురుషుల్ని టార్గెట్ చేసింది. అంతమందిలో ఓ అమాయకున్ని గుర్తుపట్టి.. అతని వద్దకు వెళ్లి పలకరిస్తుంది. వచ్చీ రాని తెలుగు, హిందీలో మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంది. పనుంది పక్కకు రమ్మంటూ తీసుకెళ్తుంది.
మాయదారి వేషాలను నమ్మి ఆమె వెనకాలే నడిచారో.. ఇక అంతే సంగతులు. చుట్టూ ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్తుంది. విషయం వేరే ఉందని గ్రహించకపోతే అడ్డంగా బుక్కయినట్లే. తొలుత సదరు వ్యక్తి జేబులు తడుముతుంది.. ఒంటిపై ఆభరణాలేమైనా ఉంటే.. లాక్కునే ప్రయత్నం చేస్తుంది.
ప్రతిఘటించారో.. గట్టిగా కేకలు పెడుతుంది. ఆపై ఆభరణాలను తన లోదుస్తుల్లో వేసుకుంటుంది. అయేషా సిగ్నల్ కోసం అప్పటిదాకా.. ఆ చుట్టు పక్కలే నక్కి ఉండే భర్త.. ఆమె అరుపులు వినగానే వెంటనే రంగప్రవేశం చేస్తాడు. తన భార్యపై అత్యాచారం చేస్తున్నాడంటూ రచ్చరచ్చ చేస్తాడు. అమాయకుడైతే.. నలుగురు జనం పోగయ్యేసరికి బెంబేలెత్తిపోతాడు. ఉన్నదంతా అప్పగించి.. మోసపోయానని తెలుసుకుని వెనుదిరిగాడు.
అత్యాచారం కేసు పెడుతానంటూ సాజిద్ చేసే బెదిరింపులకు చాలామంది ప్రతిఘటించే సాహసం కూడా చేయరు. అయితే వీరిద్దరి మీద గత కొన్నాళ్లుగా వరుస ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దీంతో కొన్నిరోజులుగా వీరి కోసం గాలిస్తున్న పోలీసులకు తాజాగా ఇద్దరూ చిక్కారు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.