'డ్రగ్' రాకెట్లో మరో కోణం: వెలుగుచూసిన లోకల్ బ్రాండ్, తీసుకుంటే చిత్తే!
రాజధానిని కుదిపేస్తున్న డ్రగ్ మాఫియాలో పీయూష్ అనే స్ట్రక్చురల్ ఇంజనీర్ దొరికిపోయాడు. ఎక్సైజ్ యాంటీ నార్కోటిక్ టీమ్ అధికారులు పీయూష్ డ్రగ్ దందాను చేధించి అతన్ని అరెస్టు చేశారు.
హైదరాబాద్: స్ట్రక్చురల్ ఇంజనీరింగ్ చదువుకున్న ఓ కుర్రాడు.. ఉద్యోగం ఊడిపోయిన కారణంగా అడ్డదారులు అన్వేషించాడు. కెమికల్స్ పై తనుకున్న అవగాహనతో ఏకంగా కొత్త రకం డ్రగ్ నే రూపొందించాడు. ఆపై తన శరీరాన్నే ప్రయోగశాలగా మార్చుకుని మరీ ప్రయోగాలు చేశాడు. వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన పీయూష్ అనే యువకుడి ఉదంతం ఇది.
రాజధానిని కుదిపేస్తున్న డ్రగ్ మాఫియాలో పీయూష్ కూడా దొరికిపోయాడు. ఎక్సైజ్ యాంటీ నార్కోటిక్ టీమ్ అధికారులు పీయూష్ డ్రగ్ దందాను చేధించి అతన్ని అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో అతని వద్ద నుంచి లోకల్ ఎల్ఎస్డి(లిసర్జిక్ యాసిడ్ డీథైలామైడ్)ని, ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పీయూష్ డ్రగ్స్ కు సంబంధించి హైదరాబాద్ ఎక్సైజ్ డీసీ వివేకానందరెడ్డి, టీమ్ లీడర్ అంజిరెడ్డి మరిన్ని వివరాలు వెల్లడించారు.
నోట్ల రద్దుతో ఉద్యోగం పోయి:
హైదరాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన పీయూష్ 2010లో స్ట్రక్చురల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. కోర్సు పూర్తయ్యాక జటాక్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే గతేడాది నోట్ల రద్దు కారణంగా పీయూష్ ఉద్యోగం ఊడిపోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు చవిచూసిన పీయూష్.. డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. తను చదువుకున్న చదువును డ్రగ్స్ రూపొందించడంలో ఉపయోగించాడు.
Recommended Video
ఎల్ఎస్డి డ్రగ్:
ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే గంజాయికి అలవాటుపడ్డ పీయూష్ కు.. ఓ రేవ్ పార్టీలో ఎల్ఎస్డి డ్రగ్ పరిచయమైంది. ఉద్యోగం పోయిన తర్వాత డిప్రెషన్ లో ఉన్న పీయూష్.. డ్రగ్స్ కు బానిసయ్యాడు. అయితే వాటి కొనుగోలుకు వేల రూపాయల ఖర్చవుతుండటంతో తానే డ్రగ్ సరఫరాదారుడిగా మారాడు.
డార్క్ నెట్ అనే సైట్ ద్వారా విదేశాల నుంచి ఎల్ఎస్డి డ్రగ్స్ తెప్పించి విక్రయించడం మొదలుపెట్టాడు. వీటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో.. స్వయంగా తానే వీటిని రూపొందించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు.
స్వయంగా లోకల్ డ్రగ్ రూపొందించి:
స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పై మంచి పట్టున్న పీయూష్ నార్కోటిక్ డ్రగ్స్, వాటి స్వభావంపై దాదాపు 2నెలలు ఇంటర్నెట్లో శోధించాడు. ఎల్ఎస్డికి కావాల్సిన ముడి పదార్థాలు, మోతాదులు ఆ డ్రగ్ తీసుకున్న వ్యక్తి మానసిక పరిస్థితి తదితర అంశాలన్నింటిని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఆ వెంటనే ముడిపదార్థాల సేకరణలో మునిగిపోయాడు.
వయాగ్రా, గంజాయి, యాంటీ డిప్రెషన్ మందులు, నిద్ర మాత్రలు కలిపి ఓ లోకల్ డ్రగ్ రూపొందించాడు. ఆపై తనపైనే దాన్ని ప్రయోగించుకుని పనిచేస్తుందని నిర్దారించుకున్నాడు.
ఒక్కో స్లిప్ రూ.1000రేటు:
నెదర్లాండ్స్ నుంచి కొరియర్ సర్వీస్ ద్వారా బ్లాటింగ్ పేపర్స్ తెప్పించేవాడు పీయూష్. తాను తయారుచేసిన కెమికల్ ను బ్లాటింగ్ పేపర్ మీద వేసి.. దానిపై వృత్తాకారాలను ముద్రించేవాడు. ఇలా ముద్రించిన ఒక్కో 'లోకల్ డ్రగ్ స్లిప్ ను రూ.800నుంచి రూ.1000కి విక్రయించేవాడు. తక్కువ ధరకే డ్రగ్ దొరుకుతుండటంతో చాలామంది దీనికి ఆకర్షితులయయ్యారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్నవి:
2,746స్ట్రిప్పుల కెమికల్ కోటెడ్ ఎల్ఎస్డి, 20గ్రాముల గంజాయి, 40గ్రాముల తెలుపు రంగు పొడి, 4 వెన్ లార్-ఆర్ఎక్స్ 75ఎంజీ ట్యాబ్లెట్స్, 5వెన్ లార్-ఆర్ఎక్స్ 150ట్యాబ్లెట్స్ ఒక ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.