ఐఎస్తో కలిసి కుట్ర: ముగ్గురు హైదరాబాదీలపై రాజద్రోహం కేసు
ఐఎస్ ఉగ్రవాద సంస్థ భావజాలానికి ఆకర్షితులై కుట్ర చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ముగ్గురిని విచారించిన సీసీఎస్ పోలీసులు గురువారం వారిని కలెక్టరేట్లో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి వదిలేశారు.
హైదరాబాద్: ఐఎస్ ఉగ్రవాద సంస్థ భావజాలానికి ఆకర్షితులై కుట్ర చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ముగ్గురిని విచారించిన సీసీఎస్ పోలీసులు గురువారం వారిని కలెక్టరేట్లో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో వివాదాస్పద, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్బాసిత్, నాంపల్లికి చెందిన సల్మాన్ మొహియుద్దీన్, అద్నాన్ ఖురేషిని బుధవారం విచారించిన సంగతి తెలిసిందే.
సదరు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన ఛానల్ తోపాటు రిపోర్టర్కు కూడా గురువారం నోటీసులు జారీ చేశారు. ఆపరేషన్కు సంబంధించిన పూర్తి ఫీడ్ పరిశీలన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు.
దేశ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్లోకి వెళ్లేందుకు బాసిత్, అతడి స్నేహితుడు హన్నన్ ఖురేషీ సహా నలుగురు నగర యువకులను పోలీసులు గతంలో కోల్కతాలో పట్టుకున్నారు. సిరియాకు వెళ్లే క్రమంలో 2015, జనవరి 16న నగరానికి చెందిన సల్మాన్ మొహియుద్దీన్ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం బెయిల్పై ఉన్న బాసిత్, సల్మాన్ తోపాటు హన్నన్ ఖురేషీలపై ఓ జాతీయ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ చేసి వారికి ఐఎస్ ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలను బయటపెట్టింది. కాగా, ఆ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనదేశంపై దాడులు చేస్తామంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోల్లో కనిపించి, మాట్లాడిన సల్మాన్, ఖురేషీలపై పోలీసులు సుమోటో కేసులు నమోదు చేశారు.
అంతేగాక, ఈ ముగ్గురు ఐఎస్ సానుభూతిపరులపై 121ఏ(కుట్ర), 124ఏ(రాజద్రోహం), 10అండ్13 యూఏపీఏ(చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద కేసులు నమోదు చేశారు.