హైదరాబాద్ యమ డేంజర్: వర్షం పడితే గాలిలో ప్రాణాలే.. శిశువు సహా మహిళ గుంతలో..(వీడియో)
హైదరాబాద్: నగరంలో గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశమంతా మేఘావృతమైంది. గురువారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీగా సాధారణ వర్షం కురిసింది. దీంతో వాహనదారుల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది.
వడగళ్ల వర్షం..
పంజాగుట్ట, ఖైరతాబాద్, మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. కరోనావైరస్ కారణంగా ఎక్కువగా జనం రోడ్లపైకి రాకపోవడంతో వర్షం పడినప్పటికీ ట్రాఫిక్కు అంతగా ఇబ్బంది కలగలేదు. కాగా, దక్షిణ దిక్కు నుంచి గాలులు వీచడం, ఎండ తీవ్రత వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని వెల్లడించింది.
కరోనా ఆందోళనలు..
ఒక్కసారిగా వర్షం కురియడంతో నగరమంతా చల్లని వాతావరణం ఏర్పడింది. దీంతో నగరవాసులు ఆనందిస్తున్నారు. అయితే, అదే సమయంలో ఇలాంటి వాతావరణం కరోనావైరస్ వ్యాప్తికి అనుకూలంగా మారుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నగరంతోపాటు భువనగిరి, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి, వరంగల్, తదితర ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయి. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలోనూ వర్షాలు కురిశాయి.
వర్షం పడితే హైదరాబాద్ యమడేంజరే.. శిశువు సహా మహిళ గుంతలో..
ఇది ఇలావుండగా, వర్షం కారణంగా కురిసిన నీరు జీహెచ్ఎంసీ సిబ్బంది తవ్విన గుంతలో నీరు నిండిపోయింది. అయితే, కొన్ని రోజుల శిశువును ఎత్తుకొని ఓ మహిళ ఓ మెడికల్ షాపు పక్క నుంచి వస్తోంది. అక్కడే జీహెచ్ఎంసీవారు తవ్విన గుంతలో నీరు నిండిపోయింది. అయితే, అంతగా గమనించని మహిళ అక్కడ కాలు వేయడంతో గుంతలోకి పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు మొదట శిశువును కాపాడారు. ఆ తర్వాత ఆ మహిళను కూడా రక్షించారు. దీంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి గుంతలు తవ్వి విడిచిపెట్టడంలో వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.