ఒక్క రాత్రికి రూ. లక్ష, లేదంటే అంధకారమే: విద్యార్థినులకు కీచక ప్రొఫెసర్ల మెసేజ్లు
విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు కీచకులుగా మారారు. కళాశాలలోని విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశారు. దీంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన కళాశాల ఎదుట ఆందోళన చేపట్టాయి
హైదరాబాద్: విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు కీచకులుగా మారారు. కళాశాలలోని విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశారు. దీంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన కళాశాల ఎదుట ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో నిందితులైన ముగ్గురు ప్రొఫెసర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తమ కామవాంఛ తీర్చితేనే.. ప్రాక్టికల్స్లో మార్కులు వేస్తామంటూ విద్యార్థులను వేధించారు ఆ కీచక ప్రొఫెసర్లు. లేదంటే.. నిర్దాక్షిణ్యంగా ఫెయిల్ చేస్తామని హెచ్చరించారు. ఇందుకు ఫేస్బుక్ను వేదిక చేసుకుని నిర్లజ్జగా ఆఫర్లు పెట్టారు. ఒక్కరాత్రికి రూ.లక్ష ఇస్తామంటూ విద్యార్థినులకు మెసేజ్లు పెట్టారు. ఈ విధంగా నాలుగు నెలలుగా వేర్వేరుగా ముగ్గురు విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేశారు.
ఈ వేధింపులను కొన్నాళ్లు భరించిన ఆ ముగ్గురు విద్యార్థినులు... స్నేహితుల సూచనతో ఏబీవీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ కీచక ప్రొఫెసర్ల బండారం బట్టబయలైంది. నగరశివారు అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిందీ ఘటన. దీంతో సదరు ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు 200మంది వరకు విద్యార్థులతో కలిసి సోమవారం ఉదయం కాలేజీ గేటు వద్ద బైఠాయించారు.
రాస్తారోకో నిర్వహించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు ఆ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్ బ్రాంచ్ హెచ్వోడీ సైదిరెడ్డి వెన్న, డిప్లొమా ఇన్చార్జి గోపి, స్కాలర్షిప్ ఇంఛార్జి ఉస్మాన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేశారు.
'నువ్వు ఇంజనీరింగ్ పాస్ కావాలంటే నేను చెప్పినట్టు చేయాలి. లేకపోతే నీ భవిష్యత్తు అంధకారమే. లైంగిక వాంఛ తీర్చితే రూ.లక్ష ఇస్తా. అంతేకాదు.. ఇంజనీరింగ్ పట్టాకూడా నీ చేతిలో ఉంటుంది' అని సదరు ప్రొఫెసర్లు ఫేస్బుక్, వాట్సప్లో సందేశాలు పంపారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని, తల్లిదండ్రులకు కూడా చెప్పమని షీటీమ్స్ హామీ ఇవ్వడంతోనే కీచక ప్రొఫెసర్లపై ఫిర్యాదు చేసేందుకు బాధిత విద్యార్థినులు ముందుకొచ్చారు.
కాగా, సదరు ప్రొఫెసర్ల వ్యవహారాన్ని సీపీ మహేశ్ భగవత దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. దీంతో బ్రిలియంట్ కళాశాలకు వెళ్లి, బాధిత విద్యార్థినులతో మాట్లాడాలని షీటీమ్స్ ఏసీపీ స్నేహితను సీపీ ఆదేశించారు. ఈ మేరకు ముగ్గురు విద్యార్థినులను వేర్వేరుగా ప్రశ్నించి వివరాలను సేకరించారు. ముగ్గురు ప్రొఫెసర్లు ఫేస్బుక్, వాట్స్పలో పంపిన సందేశాలను షీటీమ్స్కు వారు అందజేశారు. నిందిత ప్రొఫెసర్లు గతంలో కూడా ఇలాంటి నీచపు పనులకు పాల్పడ్డట్లు ఫిర్యాదులున్నాయని పోలీసులు తెలిపారు.