అక్రమంగా భారత పౌరసత్వం: ముగ్గురు రోహింగ్యాల అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు
హైదరాబాద్: భారత పౌరసత్వం పొందినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మయన్మార్ దేశస్థుల(రోహింగ్యా ముస్లింల)ను బాలాపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఎల్బీనగర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మయన్మార్ దేశానికి చెందిన మహ్మద్ నసీమ్(49), సలీమా బేగం(48) దంపతులకు మహ్మద్ యూనస్(25), ఇస్మాయిల్ అనే కుమారులున్నారు. మన దేశానికి శరణార్థులుగా వచ్చిన వీరు బాలాపూర్ సమీపంలోని షహీన్నగర్బిస్మిల్లా కాలనీలో ఉంటూ భారత పౌరసత్వాన్ని పొందేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు.
స్థానికంగా ఉండే ఖతీజా, మహ్మద్ ఖాలిక్లు మహ్మద్ యూనస్కు అక్కడి క్రిసెంట్ స్కూల్లో చదివినట్లు బోనఫైడ్ సర్టిఫికెట్ అందజేశారు. దాని ఆధారంగా ఆధార్, ఓటరు, పాన్, డ్రైవింగ్ లైసెన్సు, ఎస్బీఐ బ్యాంకు అకౌంటు, జనన, నివాస ధ్రువీకరణ పత్రాలు అక్రమంగా తయారుచేయించి అతనికి పాస్పోర్టును ఇప్పించారు.
అంతేగాక, కుటుంబ సభ్యులు సైతం తప్పుడు సమాచారంతో అక్రమంగా ధ్రువపత్రాలు పొందడంతో బాలాపూర్ పోలీసులు వీరిపై కేసు నమోదుచేశారు. గురువారం మహ్మద్ యూనస్, సలీమా బేగం, మహ్మద్ నసీమ్లను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, పరారీలో ఉన్న మహ్మద్ ఇస్మాయిల్, ఖతీజా, మహ్మద్ ఖాలిక్ గాలింపు చేపట్టారు.