అమెరికాలో 8నెలలుగా తెలుగు టెక్కీ జాడలేదు: కన్నీరుపెట్టిన తల్లిదండ్రలు, వేడుకోలు(వీడియో)
వాషింగ్టన్/హైదరాబాద్: ఉన్నత చదువులు చదివి, అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తానంటూ వెళ్లిన కొడుకు ఆచూకీ లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. గత 8 నెలల నుంచి అతని గురించిన ఎలాంటి సమాచారం లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మీడియా ముందు టెక్కీ తల్లిదండ్రుల ఆవేదన
అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లిన తమ కొడుకు సమాచారం లేదంటూ హైదరాబాద్ నగరంలోని చంపాపేట వినయ్నగర్ కాలనీకి చెందిన అతని తల్లిదండ్రులు పండు బంగారం, పుష్పలత మీడియా ముందు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
పెద్ద కుమారుడి మరణంతో గారభంగా..
ఆంద్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన పండు బంగారం, పుష్పలత దంపతులు ఉద్యోగ రిత్యా హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో చిన్నతనంలోనే కర్నూలులో మృతి చెందారు. దీంతో చిన్న కుమారుడు పి రాఘవేందర్రావును ఎంతో గారాంభంగా పెంచారు. ఉన్నత చదువులు చదించారు.
మైక్రోసాఫ్ట్లో ప్రాజెక్టు మేనేజర్గా రాఘవేందర్ రావు.. 8నెలలుగా
జెన్టీయులో బీటెక్, ఆ తరువాత లండన్లో 2010లో ఎంబీఏ చదివించారు. కాగా, రాఘవేందర్రావు 2011లో అమెరికా వెళ్లాడు. అక్కడి కాలిఫోర్నియాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ప్రాజెక్ట్ మెనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, ప్రతి రోజు రాఘవేందర్రావు తల్లిదండ్రులతో ఫోన్లో, వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడేవారు. కానీ, అక్టోబర్ 2017 నుంచి రాఘవేందర్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తోంది. అప్పటి నుంచి నేటి వరకు కొడుకు ఆచూకి లభించడం లేదు. అతడి స్నేహితులను ఆరా తీసినా సరైన సమాచారం లేదు. దీంతో అప్పటి నుంచి కొడుకు ఆచూకి కోసం వెతుకుతూనే ఉన్నారు ఈ తల్లిదండ్రులు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తల్లిదండ్రుల వేడుకోలు
ఈ విషయంమై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి విన్నవించారు. సైదాబాద్ పోలీసులను సంప్రదించగా వారు ఎన్ఆర్ఐ సెల్కు పంపించారు. తమ కొడుకు ఆచూకీని కనుక్కొని తమకు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. రాఘవేందర్ రావు తండ్రి బంగారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.