హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య... మొయినాబాద్లో మరో యువకుడి బలవన్మరణం...
హైదరాబాద్లోని పటాన్చెరులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో విభేదాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పెళ్లయిన నాలుగు నెలలకే అతను ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాల్తూరు గ్రామానికి చెందిన నాగవెంకట సత్యభార్గవ్ (27) చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం అదే జిల్లాకు చెందిన మంజు అనే బంధువుల అమ్మాయిని హైదరాబాద్ ఆర్య సమాజ్లో అతను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరూ చెన్నైలో కొద్దికాలం ఉన్నారు. ఇదే క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఇరువురి తల్లిదండ్రులు వారికి నచ్చజెప్పినప్పటికీ గొడవలు సద్దుమణగలేదు. నెల క్రితం చెన్నై నుంచి ఇద్దరూ హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. పటాన్చెరులోని ఇంద్రేశంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 21న ఇద్దరూ మళ్లీ గొడవపడ్డారు. దీంతో భార్య మంజు పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ మరుసటిరోజు సోదరుడు రవితేజ భార్గవ్ ఇంటికెళ్లగా... లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లగా భార్గవ్ సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్లో జరిగిన మరో ఘటనలో నవీన్కుమార్రెడ్డి(29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం చదువు నిమిత్తం కెనడా వెళ్లిన అతను మూడు నెలల క్రితమే తిరిగొచ్చాడు. నవీన్ సోదరుడు అనుదీప్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తున్నాడు. ఆ డబ్బులతో తల్లిదండ్రులు కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. తమ్ముడు సంపాదిస్తుంటే తాను ఖాళీగా ఉండటం నవీన్ను కలచివేసింది. ఉద్యోగం దొరక్కపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇదే క్రమంలో ఆదివారం(ఫిబ్రవరి 21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.