దారుణం: అమీర్పేటలో టెక్కీ దారుణ హత్య, భార్య బంధువులపైనే అనుమానం!
హైదరాబాద్: నగరంలోని అమీర్పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ధరంకరం రోడ్డులో కేశన చంద్రశేఖర్ రాజు(25)ను దుండుగులు కత్తులతో పొడిచి చంపారు. అతని భార్య తరపు బంధువులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టెక్కీ భార్య ఆత్మహత్య..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేశర్ రాజుతో మచిలీపట్నంకు చెందిన లక్ష్మీగౌరి(22)కు 2019 ఫిబ్రవరి 23న వివాహం జరిగింది. హైదరాబాద్ నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రాజు.. తన భార్యతో కలిసి అల్విన్ కాలనీలో కాపురం పెట్టాడు. కాగా, ఈ ఏడాది జూన్ 1న లక్ష్మీగౌరి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
భర్త, అత్తింటి వేధింపులతోనే..
భర్త, అతడి తల్లిదండ్రులు వరకట్నం కోసం వేధించడం వల్లే లక్ష్మీగౌరి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రశేఖర్ తోపాటు అతడి తల్లిదండ్రులు కృష్ణారావు, ఝాన్సీలక్ష్మిపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో జైలుకెళ్లిన చంద్రశేఖర్రాజు ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు. అయితే, ప్రతివారం బాలానగర్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి హాజరుకావాల్సి ఉండటంతో ధరంకరం రోడ్డులోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు.
Recommended Video
మాటువేసి హతమార్చారు..
ఆదివారం ఉదయం చికెన్ తీసుకొచ్చేందుకు కిందికి వెళ్లిన చంద్రశేఖర్ రాజుపై దాడి చేసిన నలుగురు దుండగులు.. అపార్ట్మెంట్ సెల్లారులోనే కత్తులతో పొడిచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చంద్రశేఖర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా, చంద్రశేఖర్ రాజు భార్య లక్ష్మీగౌరి బంధువులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లభించిన ఆధారాలతో దర్యాప్తు చేపట్టి, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.