వ్యాపారి వద్ద రూ.30 లక్షలు దోపిడీ: పోలీసులకు చిక్కిన ఇన్స్పెక్టర్
ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారికి రూ.30 లక్షలు టోకరా వేసిన ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. రాష్ట్రం దాటి వెళ్లే ప్రయత్నంలో ఉన్న అతన్ని పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాదులోని బంజారాహిల్స్లో ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారి నుంచి రూ.30 లక్షలు తీసుకుని మోసం చేయడానికి ప్రయత్నించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వై. రాజశేఖర్ ఏడు రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు. అతను హైదరాబాదులోని టప్పచబుత్రా పోలీసు స్టేషన్లో పనిచేస్తున్నాడు.
ఖమ్మం వ్యాపారి నుంచి అతను హైదరాబాదులోని బంజారాహిల్స్లో 30 లక్షల రూపాయలు దోచుకుని పారిపోయాడు. తనకు తెలిసినవారి ఇంట రాజశేఖర్ దాచుకున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా అతను విజయవాడకు, తూర్పు గోదావరి జిల్లాకు మధ్య తిరుగుతున్నట్లు గుర్తించారు.
అదే సమయంలో రాష్ట్రం వదిలి పారిపోయే ప్రయత్నంలో ఉన్నట్లు కూడా సమాచారం. ఇంతకు ముందు హైదరాబాదు పోలీసులు అతని అనుచరుడు, స్థానిక కాంగ్రెసు నాయకుడు తిరుమలేష్ నాయుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరింత మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ నెల ప్రారంభంలో రాజశేఖర్ లక్ష్మణ్ అగర్వాల్ అనే వ్యాపారిని బెదిరించి రూ.30 లక్షలు దోచుకున్నాడు. రాజశేఖర్, అతని అనుచరులు వ్యాపారిని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో పట్టుకుని పాత నోట్లను మార్పిడి చేసి ఇస్తామని చెప్పి వాటితో పరారయ్యారు. నోట్లను మార్పిడి చేసుకోవడానికి లక్ష్మణ్ అగర్వాల్ హైదరాబాదుకు వచ్చినప్పుడు ఇది జరిగింది.