దేశంలో తొలిసారిగా: శంషాబాద్ విమానాశ్రయంలో ఫేస్ రికగ్నిషన్ పద్ధతికి శ్రీకారం
హైదరాబాద్ : సేవల రంగంలో ఇప్పటికే వరసుగా రెండోసారి అవార్డు పొందిన హైదరాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో కొత్త సాంకేతికతకు తెరతీయనుంది. జీఎంఆర్ అధీనంలో నడుస్తున్న హైదరాబాద్ ఎయిర్పోర్టు... వ్యక్తుల ముఖాలను గుర్తించే ప్రక్రియను విజయవంతంగా పరీక్షించింది. ముందుగా విమానాశ్రయంలోని ప్యాసింజర్ టర్మినల్ వద్ద ఈ పరికరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా సిబ్బందికి ముఖ గుర్తింపు పరీక్షలు చేశారు. ఇది సక్సెస్ అయ్యింది. దీంతో నియంత్రణ సంస్థలనుంచి క్లియరెన్స్ రాగానే ఇది ప్రయాణికులకు కూడా వర్తింపజేస్తామని జీఎంఆర్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది చివరికల్లా ఈ కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.
సేవా రంగంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ టాప్..వరుసగా రెండో సారి అవార్డు
Recommended Video
ఫేస్ రికగ్నిషన్ సేవలు ఎలా వినియోగించుకోవాలి
ఇక ఫేస్ రికగ్నిషన్ సేవలు వినియోగించుకోవాలంటే ముందుగా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్రోల్ అయ్యాక భవిష్యత్తులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లాలన్నా వెళ్లొచ్చు. నమోదు చేసుకునేందుకు టర్మినల్ ఎంట్రీ వద్ద కియోస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడే ప్రయాణికుల ముఖాన్ని, ప్రభుత్వంచే జారీ చేయబడ్డ గుర్తింపు కార్డులను రిజిస్టర్ చేస్తారు.
ఫేస్ రికగ్నిషన్ ఎలా పనిచేస్తుంది..?
ఫేస్ రికగ్నిషన్ ఎన్రోల్ అయిన ప్యాసింజర్ తన బోర్డింగ్ పాస్ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. సిస్టం బోర్డింగ్ పాస్ సమాచారాన్ని ఎయిర్లైన్స్ డిపార్చర్ కంట్రోల్ సిస్టంతో పోల్చి చూసుకుంటుంది. సమాచారం అంతా కరెక్ట్గా ఉందని వెరిఫై చేసుకోగానే... ప్రయాణికుడి ముఖం టికెట్పై మ్యాప్ అవుతుంది. ఇక మిగతా పాయింట్లు అంటే సెక్యూరిటీ, బోర్డింగ్ గేట్ దగ్గర ఫేస్ రికగ్నిషన్ యంత్రాలను ఉంచుతారు. అవి ముఖాన్ని గుర్తించగానే ప్రయాణికుడి వివరాలతో పాటు విమానంకు సంబంధించిన వివరాల సమాచారం అంతా సీఐఎస్ఎఫ్ లేదా ఎయిర్లైన్స్ కు చేరుతుంది.
ఫేస్ రికగ్నిషన్తో ఉపయోగం ఏమిటి..?
ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ అమలైతే ప్రయాణికుని యొక్కనిర్దుష్టత మరియు సౌలభ్యం రెండింటిలో మెరుగుదల కనిపిస్తుంది. ఇప్పటికైతే బార్ కోడ్ లేదా QR కోడ్ అమల్లో ఉంది. ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ దీనికి కొనసాగింపు అని చెప్పొచ్చు. దీని ఏర్పాటుకు అదనంగా కొంత మౌలిక సదుపాయాల నిర్మాణం అవసరమవుతుంది. ఇప్పటికే సిబ్బందిపై చేసిన పరీక్షలు విజయవంతం అవడంతో త్వరలోనే జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ (GHAIL) భారత్లోనే తొలిసారిగా హైదరాబాద్లో ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తోంది.
GHAIL ఈ బోర్డింగ్ సొల్యూషన్కు 2015లోనే BACSచే ధృవీకరించబడింది. ఆధార్ అనుసంధానం కూడా త్వరలోనే జరుగుతుంది. భవిష్యత్తులో రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ప్రయాణం అంతా పేపర్ రహితంగానే ఉంటుందని యుద్ధప్రాతిపదికన ప్రారంభించి ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని అధికారి ఒకరు వెల్లడించారు. బయోమెట్రిక్ గుర్తింపు పద్ధతి వస్తే టికెట్, బోర్డింగ్ పాస్లకు కాలం చెల్లుతుందన్నారు.