తస్మాత్ జాగ్రత్త: ఒకే ఒక ఫోన్కాల్తో చాలా డబ్బును కొల్లగొట్టిన కేటుగాడు..ఎలాగంటే..?
హైదరాబాదు: ఒకరిని మోసం చేయాలని భావించే వ్యక్తికి వంద దారులు ఉంటాయని ఓ ఘటన నిరూపించింది. మోసపోవడం తప్పుకాదు కాని ఆ సమయంలో తెలివిగా ఉండకపోవడం తప్పే. మోసాలు చాలా రకాలున్నాయి. ప్రత్యేకించి సైబర్ మోసాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫలానా వ్యక్తి అని పరిచయం చేసుకోవడం ఆ తర్వాత ఉన్నది ఊడ్చుకెళ్లడం ఒక తరహా మోసం అయితే... ఆన్లైన్ మోసాలు అతి దారణంగా ఉంటున్నాయి. మన ఖాతాలోని డబ్బులు మనకు తెలియకుండానే కాజేస్తున్నారు. ఈ తరహా మోసాలకు చాలా మంది బలవుతున్నారు.
తాజాగా రామంతాపూర్లో ఓ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యాపారికి ఉన్నట్లుగా ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను ఓ ఎయిర్ టెల్ ఆఫీసు ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. కాసేపు బాగా మాట్లాడిన వ్యక్తి మరి కొద్దిరోజుల్లో మీ సిమ్ బ్లాక్ అవుతుందని తెలిపాడు. ఆ వ్యాపారి ఎందుకు బ్లాక్ అవుతుందని కూడా ప్రశ్నించలేదు. ఎయిర్ టెల్ ప్రతినిధే ఫోన్ చేశాడని నమ్మిన వ్యక్తి బ్లాక్ కాకుండా ఉండేందుకు ఏమి చేయాలని ప్రశ్నించాడు. వెంటనే అవతల వ్యక్తి మీ యూపీఐ ఖాతా నుంచి రూ.10 బదిలీ చేయమన్నాడు. అయితే తనకు యూపీఐ ఖాతా లేదని చెప్పడంతో ఓ మెసేజ్ను పంపుతానని అదే మెసేజ్ను తాను ఇచ్చే మరో మొబైల్ నెంబర్కు ఫార్వర్డ్ చేయాలని కోరాడు.
ఎయిర్టెల్ ప్రతినిధిగా భావించిన వ్యాపారి ఆ మోసగాడు చెప్పినట్లే చేశాడు. ఇంకేముంది అలా ఆ మెసేజ్ను మోసగాడు చెప్పిన మొబైల్ నెంబరుకు ఫార్వర్డ్ చేసిన కొద్ది క్షణాల్లోనే వ్యాపారి ఖాతాలో రూ. 99వేలు మాయమైంది. వెంటనే తన ఖాతా నుంచి విత్డ్రా అయినట్లు వ్యాపారి మొబైల్కు మెసేజ్ రావడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. తనదగ్గరే ఏటీఎం కార్డు ఉంది.. డబ్బులు ఎలా తన ఖాతా నుంచి కట్ అయ్యాయో అర్థం కాలేదు. వెంటనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన పోలీసులు అసలు సంగతి బయటపెట్టారు. మరోవైపు ఆన్లైన్ మోసగాళ్లను గుర్తించడంలో తెలివిగా వ్యవహరించాల్సిందిగా పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ఏ బ్యాంకు ఫోన్ చేసి పాస్వర్డ్లు కానీ ఇతరత్రా వివరాలు కానీ అడగదని కొందరు కేటుగాళ్లు ఇలాంటి పనులకు పాల్పడుతూ దోచుకుంటున్నారని వారిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నారు.