హైదరాబాద్ వ్యాపారి కిడ్నాప్ కలకలం.. కోటి రూపాయల వ్యవహారం.. నిజమా, డ్రామానా?
హైదరాబాద్ : నగరంలో వ్యాపారి కిడ్నాప్ కేసు ఎంత కలకలం రేపిందో.. ఆయన్ని విడిచిపెట్టిన వైనం కూడా అంతే కలవరం పుట్టిస్తోంది. చివరకు ఆ కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. దోమలగూడ ఏరియాకు చెందిన గజేంద్ర ప్రసాద్ ఆటో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి సమయంలో గజేంద్ర ప్రసాద్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే అని భయపెట్టిస్తూ ఫోన్ కట్ చేశారు.
ఆ క్రమంలో మూడు కోట్లు కాదంటూ కోటి రూపాయలు ఇవ్వగల్గుతామని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారట. దానికి ఓకే చెప్పిన కిడ్నాపర్లు సోమవారం నాడు ఫలానా చోట కలుద్దామని అడ్రస్ ఇచ్చారట. ఆ మేరకు గజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు కిడ్నాపర్లు చెప్పినట్లుగా కోటి రూపాయలు ముట్టజెప్పడంతో ఆయనను అబిడ్స్లో వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.
వారం రోజులాయే.. కిడ్నాప్ కేసులో పోలీసులకు సవాల్.. నిందితుడి సమాచారం ఇస్తే లక్ష నజారానా..!
దుండగుల చెర నుంచి బయటకు వచ్చిన గజేంద్ర ప్రసాద్ పోలీసులను ఆశ్రయించారు. తనను కిడ్నాప్ చేసిన క్షణం నుంచి విడిచిపెట్టిన వరకు జరిగిన పరిణామాలను వివరించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వ్యాపార లావాదేవీలే గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్కు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముంబై వ్యాపారవేత్తలతో ఆయనకు గొడవలు ఉన్నట్లు సమాచారం.
ఫార్చ్యూన్ ఫైనాన్స్ కేసులో దాదాపు 24 కోట్ల రూపాయల మేర మోసం చేశాడనే ఆరోపణలతో గజేంద్ర ప్రసాద్ అన్నను ఇదివరకు ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ నేపథ్యంలో గజేంద్రప్రసాద్ కిడ్నాప్ జరిగిందా లేదంటే ఇతర కారణాలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. అదలావుంటే కిడ్నాప్ నిజంగా జరిగిందా లేదంటే వేరే కోణముందా అనేది కూడా పరిశీలిస్తున్నారట.