షూ వేసుకురాలేదని విద్యార్థికి శిక్ష: శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్పై కేసు, కడియం ఆగ్రహం
హైదరాబాద్: షూ వేసుకురాలేదనే కారణంగా ఓ విద్యార్థి పట్ల అనుచితంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ సునీత తెలిపిన వివరాల ప్రకారం... శేరిలింగంపల్లిలోని మదీనాగూడకు చెందిన చేతన్చౌదరి(12) మొయినాబాద్ మండలం అజీజ్నగర్ పరిధిలోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడోతరగతి చదువుతున్నాడు.
కాగా, అక్టోబర్ 30న కాలికి గాయం కావడంతో బూట్లు వేసుకోకుండా చెప్పులతో పాఠశాలకు వెళ్లాడు. దీంతో తరగతి ఉపాధ్యాయురాలు రెండు రోజుల పాటు శిక్ష విధించింది. ఈ క్రమంలో విద్యార్థి మనస్తాపానికి గురయ్యాడు. ఆరోజుది కాకుండా మరో యూనిఫాం వేసుకున్నాడనే కారణంగా సోమవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని తరగతి గదిలోకి అనుమతి ఇవ్వకుండా బయట నిల్చోబెట్టారు.
ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో యాజమాన్యంతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ వారి నుంచి సానుకుల సమాధానం రాలేదు. దీంతో విద్యార్థి తల్లి సోమవారం రాత్రి మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చిన్న చిన్న పొరపాట్లకు కూడా స్కూల్ యాజమాన్యం ఇలా కార్పొరేట్ శిక్షలు వేయడమేంటని విద్యార్థి తల్లి వాపోయింది. యాజమాన్యం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. స్కూల్ యాజమాన్యానికి ఏడాదికి రూ.4.32లక్షలు పీజులుగా చెల్లిస్తున్నామని వివరించింది. కాగా, సదరు విద్యార్థి తండ్రి అమెరికాలో ఉంటున్నట్లు తెలిసింది.
కడియం శ్రీహరి ఆగ్రహం
మొయినాబాద్ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దని అన్నారు.
స్కూల్ యాజమాన్యం తప్పుచేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు.