ఫొటోల మార్ఫింగ్, అశ్లీల రాతలపై ‘మా’ ఫిర్యాదు.. వెబ్ సైట్లపై కేసు నమోదు
సినీ ప్రముఖుల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్ట్ లు పెడుతున్న ప్రవేటు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న ‘మా’ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్: సినీ ప్రముఖుల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్ట్ లు పెడుతున్న ప్రవేటు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.
తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి తమ క్యారెక్టర్ ని దెబ్బ తీయాలని చూస్తున్న వెబ్సైట్ల ఫై చర్యలు తీసుకోవాలని 'మా' అసోసియేషన్ సభ్యులు పోలీసులను కోరారు. ఉద్దేశపూర్వకంగా కొందరు వారి వెబ్ సైట్లలో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేసి, తమకు ఇష్టమొచ్చిన కథనాలను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కొన్ని అశ్లీల వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై ఐటీ యాక్ట్ 67, 67ఎ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ ఎస్పీ రామ్మోహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు ఈ తరహా పోస్ట్ లు ఎక్కడ్నించి చేసినా పట్టుకుంటామని హెచ్చరించారు.
ఒక్క సినీ ప్రముఖులనే కాదు, ఎవరు ఫిర్యాదు చేసినా నిందితులను వదలమని, సంబంధిత చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఏ దేశం నుంచి ఆపరేట్ చేసినా నిర్వాహకులు తప్పించుకోలేరని, నిర్వాహకులపైనే కాకుండా.. అలాంటి కంటెంట్ అప్ లోడ్ చేసే వారిపైనా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రామ్మోహన్ హెచ్చరించారు.
కొన్ని వందల వెబ్ సైట్లపై తమకు ఫిర్యాదులు అందాయని, ఇప్పటి వరకు 20 వెబ్ సైట్లను గుర్తించామని, వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచేలా కథనాలు రాసినా, ఫొటోలు ప్రచురించినా, అశ్లీలంగా చూపెట్టినా శిక్షార్హులేనని, ఈ విషయంలో ఎవరు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.