కరోనా విలయం: గాంధీలో మెరుపు ఆందోళన.. ఆవరణలో సహాయక సిబ్బంది నిరసన
అతిపెద్ద కరోనా ఆస్పత్రుల్లో ఒకటిగా కొవిడ్-19 పేషెంట్ల ట్రీట్మెంట్ లో ముందున్న హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఊహించని సీన్లు కనిపించాయి. ఆస్పత్రిలో క్లీనింగ్, పేషెంట్ కేర్ విధులు నిర్వహించే వందల మంది సిబ్బంది గురువారం అనూహ్యరీతిలో మెరుపు ఆందోళనకు దిగడం సర్వత్రా కలవరం రేపింది. రాష్ట్రంలో ఉన్న పాజిటివ్ కేసుల్లో ఎక్కువ గాంధీలోనే ట్రీట్మెంట్ ఇస్తుండటం తెలిసిందే. అలాంటి చోట ఇలాంటి పరిణామం ఒకింత ఇబ్బందికరంగా మారింది.
సోషల్ డిస్టెన్సింగ్ మరచి..
గాంధీ ఆస్పత్రిని శుభ్రపరిచేసే, రోగులకు సంరక్షకులుగా వ్యవహరించే సిబ్బంది అందరూ ఆస్పత్రి ఆవరణలో గుమ్మికూడి మౌననిరసనకు దిగారు. అయితే ఆ సమయంలో వారంతా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, గుంపులుగా దగ్గరగా నిలబడటం ఆందోళన రేకెత్తిస్తున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరస్ అయ్యాయి. నిజానికి తెలంగాణతోపాటు దేశమంతటా అపిడమిక్ యాక్ట్ అమలులో ఉన్నందున డాక్టర్లుగానీ వైద్య సిబ్బంది లేదా సహాయకులుగానీ ఆందోళన చేపట్టడానికి వీల్లేదు. కానీ..
అసలెందుకు చేశారు?
గాంధీలో వైద్య సహాయక సిబ్బంది సడెన్ గా ఆందోళనకు దిగడానికి కారణం.. ‘సీఎం స్పెషల్ గిఫ్ట్'పై అదనపు డిమాండ్ అని తెలుస్తోంది. కరోనాతో పోరాటంలో ముందు వరుసలో నిలబడి ప్రజల్ని కాపాడుతున్న వైద్య సిబ్బంది, సఫాయి కార్మికులకు ఇటీవలే సీఎం కేసీఆర్ ‘స్పెషల్ గిఫ్టులు ప్రకటించడం తెలిసిందే. ఆస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి, సహాయక సిబ్బందికి ఒకలా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్లో పనిచేసే కార్మికులకు మరోలా గిఫ్ట్ ప్యాకీజీలు రూపొందించారు. అయితే, జీహెచ్ఎంసీ కార్మికులకు ఇచ్చిన ప్యాకేజీనే తమకు కూడా ఇవ్వాలని గాంధీలోని వైద్య సహాయక సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే కాసేపు విధులు ఆపేసి, మెరుపు ఆందోళనకు దిగారు. కాగా, ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వారంతో తిరిగి డ్యూటీల్లో చేరినట్లు తెలుస్తోంది.
ఇవీ గిఫ్ట్ ప్యాకేజీలు..
మిగతా ఉద్యోగులందరికీ వేతనంలో కోత విధించినా, కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్లో ఉన్న విభాగాలకు మాత్రం పూర్తి స్థాయి వేతనం చెల్లించారు. దాంతోపాటు సీఎం ప్రత్యేక ప్రోత్సాహకం కింద జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్లో పనిచేసే కార్మికులకు రూ.7,500 అదనంగా అందించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లోని పారిశుద్ధ్య సిబ్బందికి రూ.5వేల చొప్పున అందించారు. అదే వైద్యశాఖ సిబ్బందికి పూర్తి వేతనంతోపాటు వారికి గ్రాస్ శాలరీలో 10 శాతాన్ని సీఎం గిఫ్ట్ గా ప్రకటించారు. ఇప్పుడు గాంధీ వైద్య సహాయక సిబ్బంది తమకు కూడా రూ.7500 అదనపు సాయం అందించాలని అభ్యర్థిస్తున్నారు.
తెలంగాణలో ఇదీ పరిస్థితి..
బుధవారం రాత్రి వరకు తెలంంగాణలో కొవిడ్-19 మొత్తం కేసుల సంఖ్య 453కి పెరిగింది. అందులో 45మందిని డిశ్చార్జ్ చేయగా, 11 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులుగా చికిత్స పొందుతోన్న 397 మందిలో ఏ ఒక్కరు కూడా ప్రాణాపాయ స్థితిలో లేరని హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో వైద్య సిబ్బంది రక్షణ పరికరాలకు ఎలాంటటి కొరత లేదని మంత్రి తెలిపారు.
Recommended Video