భార్యాభర్తలే.. పెళ్లయిన నెలకే: 16కేజీల గంజాయితో సిటీకి.. ఇలా పట్టుబడ్డారు?
వీరి వద్ద నుంచి 16కేజీల గంజాయిని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థికావసరాల కోసమే వీరు గంజాయి సప్లయర్స్ గా మారినట్లు సమాచారం.
విశాఖపట్నం: ఆర్థిక ఇబ్బందులు సైతం చాలామందిని మాదకద్రవ్యాల దందాలోకి లాగుతున్నాయి. రిస్క్తో కూడుకున్నప్పటికీ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న ఉద్దేశంతో చాలామంది గంజాయి సరఫరా దందాలో దిగుతున్నారు.
తాజాగా ఇదే రీతిలో గంజాయి సరఫరా చేస్తూ విశాఖపట్నంకు చెందిన ఓ జంట పట్టుబడింది. వీరి వద్ద నుంచి 16కేజీల గంజాయిని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థికావసరాల కోసమే వీరు గంజాయి సప్లయర్స్ గా మారినట్లు సమాచారం.
విశాఖ జంట:
పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా బురుగువీధికి చెందిన రాజారావు అలియాస్ ప్రసాద్ పదోతరగతి వరకు చదివి.. ఆపై వ్యవసాయదారుడిగా స్థిరపడ్డాడు. గత నెలలోనే ఇతనికి అదే ప్రాంతానికి చెందిన లక్ష్మీ అలియాస్ భవానీతో వివాహం జరిగింది.
వివాహం జరిగిన నెల రోజులకే వీరిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఏజెన్సీలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న గంజాయి దందా వీరి దృష్టికి వచ్చింది. అక్కడ సాగవుతున్న గంజాయిని విక్రయించడం ద్వారా డబ్బులు సంపాదిచవచ్చునని తెలుసుకున్నారు.
Recommended Video
స్నేహితుడి సహాయం
గంజాయి సరఫరా కోసం జీ-మాడుగులకు చెందిన రాజారావు స్నేహితుడు భీమన్న వీరికి సహకరించాడు. గంజాయిని హైదరాబాద్ ఎలా తీసుకెళ్లాలి? అక్కడెలా విక్రయించాలి? వంటి విషయాలు వారికి చెప్పాడు. భారీ లాభాలు ఉంటాయని ఆశచూపడంతో.. కొత్త జంట అందుకు సిద్దమైంది.
వాళ్లిద్దరితో డీలింగ్:
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, బేగంబజార్ కు చెందిన జ్యోతి, బల్లూసింగ్ అనే ఇద్దరి ఫోన్ నంబర్స్ సంపాదించారు. వారిని ఫోన్ ద్వారా సంప్రదించగా.. గంజాయి కొనుగోలు చేస్తామని చెప్పారు. వారి మాట మేరకు విశాఖ నుంచి కొన్ని కేజీల గంజాయితో హైదరాబాద్ చేరుకున్నారు. కేజీకి రూ.1000చొప్పున వీరు దాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం.
వచ్చి దొరికిపోయారు
ఆపై హైదరాబాద్ చేరుకున్న వీరిద్దరు జ్యోతి, బల్లూసింగ్ లకు దాన్ని అప్పగించేందుకు మంగళ్ హాట్ లో ఉన్న దూద్ ఖానాకు చేరుకున్నారు. అదే సమయంలో దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజావెంకటరెడ్డి నేతృత్వంలోని పోలీస్ టీమ్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వారి వద్ద నుంచి 16కేజీల గంజాయి పట్టుబడినట్లు సమాచారం. రూ.3వేల చొప్పున కేజీ గంజాయిని వీరు విక్రయించినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.