విద్యార్ధులకు బెయిల్: మాట వినకుంటే రేప్ చేస్తామంటూ బెదిరింపులు
హైదరాబాద్: వీసీ వసతిగృహంపై దాడి చేసిన ఘటనలో హెచ్సీయూ విద్యార్ధులకు కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. గత వారంలో అరెస్టయిన 24 మంది విద్యార్ధులతో పాటు, ఇద్దరు ప్రొఫెసర్లు, మరొక వ్యక్తి నగరంలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిన్ను మంజూరు చేసింది.
విద్యార్ధులను రూ. 5000 పూచీ కత్తుతో పాటు వారంలో ఒకరోజు పోలీసు స్టేషన్కు హాజరు కావాలంటూ షరతులను విధించింది. మార్చి 22వ తేదీన హెచ్సీయూ వీసీగా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కొందరు విద్యార్ధులు వీసీ వసతిగృహంపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ దాడి ఘటనలో వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఇలా ఉంటే హెచ్సీయూలో ఇటీవల జరిగిన ఘటనలపై విచారించే నిమిత్తం మానవ హక్కుల సంఘం కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలతో ఏర్పాటైన స్వతంత్ర కమిటీ సోమవారం సంచలన నివేదికను ఇచ్చింది.
హెచ్సీయూలో నిరసనలు జరుగుతున్న వేళ, వాటిని అణచి వేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థినులపై అత్యాచారం చేస్తామని బెదిరించారని ఆరోపించింది. యువతులను ఇష్టానుసారం కొట్టారని, మాటలతో చెప్పలేని విధంగా దూషించారని అందులో పేర్కొన్నారు.
విద్యార్ధినిలు అని కూడా చూడకండా ఉగ్రవాదులంటూ ఈడ్చుకెళ్లారని, తమ మాట వినకుంటే అత్యాచారం తప్పదని హెచ్చరించారని తమకు ఫిర్యాదులు అందినట్టు కమిటీ నివేదిక ఇచ్చింది. అరెస్టయిన విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులను 24 గంటల్లోగా న్యాయమూర్తి ముందు హాజరు పరచలేదని, పోలీసులు హౌస్ బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నా, వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారని అందులో పేర్కొంది.
ఇదే నివేదికను కమిటీ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు అందజేశారు. పోలీసులపై తక్షణం ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని విధుల నుంచి తప్పించి, విచారణ జరిపించాలని కమిటీ సిఫార్సు చేసింది. కాగా, ఈ కమిటీలో హెన్రీ తిఫాగ్నే, తాతారావు, బుర్నార్డ్ ఫాతిమా, కుఫిర్ నల్గందవర్, కురుబా మునుస్వామి, బీనా పల్లికల్, రమేష్ నాథన్, ఆశా కౌత్వాల్, పాల్ దివాకర్ తదితరులు ఉన్నారు.
కాగా సోమవారం హెచ్సీయూను సందర్శించిన మాజీ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీలు ప్రశాంతంగా ఉండేవని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత వర్సిటీల్లో దళితులపై దాడి జరుగుతోందని ఆరోపించారు.
దళితులను అణిచివేసేందుకు వీసీ అప్పారావును తీసుకొచ్చారని మండిపడ్డారు. విద్యార్ధుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న వీసీ అప్పారావు తక్షణమే రాజీనామా చేయాలని లేదంటే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్దులు కలిసి వీసీ అప్పారావుపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన విద్యార్ధులకు అండగా ఉంటామన్నారు.