తప్పించుకోలేనని డిసైడ్ అయ్యాడు- ఆత్మహత్య చేసుకున్నాడు : సీపీ అంజనీ కుమార్..!!
సైదాబాద్ చిన్నారి అత్యాచార..హత్య ఘటనలో నిందితుడి ఆత్మహత్య పైన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పందించారు. ఈ రోజు ఉదయం స్టేషన్ ఘన్పూర్ రైల్వే పట్టాల వద్ద రాజు మృతదేహం లభ్యమైనట్లు అంజనీ కుమార్ తెలిపారు. వరంగల్-ఘన పూర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించారు. 8 రోజులుగా రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
పంచనామా అనంతరం రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పైన పాశవికంగా ప్రవర్తించిన రాజు పైన కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపించింది. అనేక రాజకీయా పార్టీల నేతలు బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనను ఖండించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో పోలీసులు సైతం రాజును పట్టుకొనేందుకు అనేక టీం లను ఏర్పాటు చేసారు. నిందితుడు ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల నజరానా ఇస్తామని ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటుగా వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సైతం బాధిత కుటుంబానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తాను దీక్ష కొనసాగిస్తానంటూ దీక్షకు దిగిన షర్మిలను అర్ద్ర రాత్రి పోలీసులు ఇంటికి తరలించారు. ఇక, సినీ ప్రముఖులతో పాటుగా సెలబ్రెటీలు సైతం నిందితుడును కఠినంగా శిక్షించాలని కోరారు. ఇక, ఈ రోజు రాజు ఆత్మహత్య చేసుకున్న తరువాత కొంత ఊరట లభించిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ రియాక్ట్ అయ్యారు. రైల్వే ట్రాక్పై మృత దేహం పడి ఉన్నదని సమాచారం వచ్చిందని, లభించిన ఆనవాళ్ల ప్రకారం నిందితుడి చేతిపై మౌనిక అనే టాటూ ఉన్నట్లు పేర్కొన్నారు. మరో చేతికి 5 స్టార్ మార్క్లు ఉన్నాయని, నిందితుడి కుటుంబ సభ్యులు రాజు మృతదేహాన్ని గుర్తించారని పేర్కొన్నారు. గత 5,6 రోజులుగా రాజు కోసం రాష్ట్రమంతా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని తెలిపారు. పోలీసుల నుంచి తప్పించుకోలేనని నిందితుడి మైండ్లో పడిపోయిందని, ఆ భయంతోనే రాజు ఆత్మ హత్య చేసుకున్నాడని వెల్లడించారు.
చిన్నారి ప్రాణాన్ని చిదిమేసిన కామాంధుడు రాజు మరణించడంతో బాధిత కుటుంబంతో పాటు అనేకమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో టపాకాయలు సైతం కాల్చి రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.