హైదరాబాద్ లో మతకల్లోలాల ప్రచారం..వాళ్ళపై పీడీ యాక్ట్ లు: సీపీ వార్నింగ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ విమర్శనాస్త్రాలకు తెరతీశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు చెలరేగుతాయి అని, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండదని టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంటే, బిజెపి కూడా హైదరాబాద్లో రోహింగ్యాలు నివసిస్తున్నారని, పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అగ్గి రాజేస్తోంది.
ఇక తాజా పరిణామాలతో భాగ్యనగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంఐఎం నేతలు బీజేపీ పై తీవ్రంగా మాటల దాడి చేస్తుంటే, అందుకు ధీటుగా బీజేపీ కూడా ఎంఐఎం పై నిప్పుల వర్షం కురిపిస్తోంది. దీంతో హైదరాబాద్లో మతకల్లోలాల ఆస్కారముందని సోషల్ మీడియాలో బీభత్సమైన ప్రచారం జరుగుతోంది.
ఎన్నికలు వస్తాయిపోతాయి కానీ హైదరాబాద్, ప్రజలు శాశ్వతం
ఈ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఆయన ఒక వీడియో సందేశాన్ని ని విడుదల చేశారు . ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి అని కానీ హైదరాబాద్, హైదరాబాద్ ప్రజలు మాత్రం శాశ్వతంగా ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో చాలామంది హైదరాబాద్ లో ఏదో జరగబోతోంది అంటూ ప్రచార వేదికలపై మాట్లాడుతున్నారని, మత ఘర్షణలను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
మతఘర్షణలు సృష్టించే వారిపై పీడీ యాక్ట్
నగర ప్రజలు సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేసిన సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మతఘర్షణలు రేకెత్తించేలా, లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించే వాళ్ళ పై పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు.
నగరంలో ఎలాంటి ఘటనలు జరిగిన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చిన సిపి అంజనీ కుమార్ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై కూడా ఉక్కుపాదం మోపుతామని, మత విద్వేషాలను రేకెత్తించే పోస్టులు పెడితే కేసులు పెడతామని గట్టిగా హెచ్చరించారు.
Recommended Video
శాంతిభద్రతలను సమీక్షించిన సీఎం కేసీఆర్ .. పోలీసులకు అదేశాలు
మరోవైపు సీఎం కేసీఆర్ కూడా హైదరాబాదులో మతకల్లోలాలను రేపే కుట్ర జరుగుతోందని జిహెచ్ఎంసి ఎన్నికలను ఆపే పన్నాగాన్ని చేస్తున్నారని పేర్కొన్నారు . ప్రశాంతత విషయంలో రాజీ పడేది లేదని. పోలీసు అధికారులకు అందుకే పూర్తి స్వేచ్చను ఇచ్చామని సీఎం వెల్లడించారు. శాంతి భద్రతలపై సమీక్షించిన క్రమంలో సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘవిద్రోహ శక్తుల ఆటలను సాగించేది లేదని తేల్చి చెప్పారు.
రెచ్చగొడితే యువత రెచ్చిపోకూడదని పేర్కొన్న కేసీఆర్ . హైదరాబాద్ లో సంతోషం గా జీవిస్తున్న నగర ప్రజల మధ్య మత చిచ్చు పెట్టడానికి,శాంతిభద్రతలకు విఘాతం కలిగించటానికి ప్రయత్నాలు చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.