చదివింది ఐటీఐ: హ్యాకింగ్లో దిట్ట, నష్టం 50 లక్షలు, చివరకు చిక్కాడు
హైదరాబాద్: హ్యాకర్ అంటే స్పెల్లింగ్ కూడా తెలియదు. కానీ నగరానికి చెందిన ఓ కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్ కోడ్ను హ్యాక్ చేసి రూ. 50 లక్షల నష్టాన్ని కలిగించిన ఒడిశా యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
ఒడిశాలోని బాలాపూర్ జిల్లా శిబ్బాపూర్కు చెందిన హిమాలయ మహంతి (19) ఐటీఐ కోర్సును పూర్తి చేశాడు. ఇటీవల కొనుగోలు చేసిన స్మార్ట్ఫోన్తో నెట్ బ్రౌజింగ్ చేస్తూ పలు హ్యాకర్స్ ఫోరమ్లలో చేరాడు. వారితో వచ్చిరాని ఇంగ్లీష్ పదాలతో తన భావాలను షేర్ చేయటంతోపాటు వారిచ్చే సమాచారాన్ని గూగుల్ ట్రాన్స్లేటర్ ద్వారా ఆంగ్ల పదాలను ఒరియా భాషలో మార్చుకొని హ్యాకింగ్ నేర్చుకున్నాడు.
ఈ క్రమంలో హైదరాబాద్లోని జీడిమెట్లలో ఉన్న లాయడ్ ఎలక్ట్రికల్ పరికరాల కంపెనీ టోల్ ఫ్రీ నంబరును టార్గెట్ చేశాడు. ఫ్రీ కాల్స్ ఎనీవేర్ పేరిట ఓ వెబ్సైట్ తయారు చేసి దానిలో ఆ కంపెనీ టోల్ఫ్రీ నంబరును పొందుపరిచాడు. దీంతో దేశవ్యాప్తంగా చాలా మంది ఈ వెబ్సైట్ను చూసి ఫ్రీ కాల్స్తో మోత మోగించారు.
దీంతో మూడు నెలల్లో 50 లక్షల బిల్లు రావడంతో కంగుతిన్న కంపెనీ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. మహంతి రూపొందించిన HIMALAYAHEKAR వెబ్సైట్ ద్వారా ట్రాక్ చేసి ఒడిశాలో అతనిని అరెస్ట్ చేశారు. చదువు రాకపోవడంతో HACKER కు బదులు HEKAR గా వెబ్సైట్ను నమోదు చేసినట్టు పోలీసుల గుర్తించారు.
ఈ వ్యవహారంలో ప్రాక్సీ సర్వర్ల ఐపీ అడ్రస్లను టాంజానియా, పలు ఆఫ్రికాదేశాల్లో ఉన్నట్టు పొందు పరిచాడు. చదువు రాకపోయినా మైండ్తో హ్యాకింగ్కు పాల్పడుతున్న మహంతిని పట్టుకునేందుకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పెద్ద పథకమే వేశారు. ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ టీం అత్యాధునిక సైబర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో అతను చివరకు పోలీసులకు దొరికిపోయాడు.