సౌదీలో హైదరాబాద్ వైద్యుడికి నరకం: సుష్మాను సాయం కోరిన భార్య
హైదరాబాద్: ఉపాధి కోసం వెళ్లిన సౌదీ అరేబియాలో వైద్యుడైన తన భర్తకు.. అతని యజమాని నరకం చూపిస్తున్నాడని ఓ మహిళ తెలిపింది. ఒప్పందం గడువు ముగిసినా యజమాని అతన్ని స్వస్థలానికి పంపించకుండా జీతం ఇవ్వకుండా నరకం చూపిస్తున్నాడని వాపోయింది. తన భర్తను విడిపించండి అంటూ అతని భార్య విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సాయం కోరింది.
వివరాల్లోకెళితే.. హైదరాబాద్కి చెందిన అనిల్ మల్లం బాలయ్య అనే వ్యక్తి 2012లో సౌదీ వెళ్లాడు. అక్కడ అలీ డెంటోప్లాస్ట్ సెంటర్లో అనిల్ ఆర్థోడెంటిస్ట్గా పనిచేస్తున్నాడు. 2014లో అనిల్ తన ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నాడు.
ఆ ఒప్పందం 2016లో పూర్తైంది. అయినప్పటికీ అనిల్ను హైదరాబాద్కు పంపించడానికి యజమాని అలీ ఒప్పుకోవడంలేదు. ఉచితంగా వైద్యం చేయడంలేదని కొందరు పేషెంట్లు క్లినిక్పై కేసు పెట్టారని ఈ కేసు తేలేవరకు హైదరాబాద్ పంపించేది లేదని బెదిరింపులకు గురిచేస్తున్నాడు.
అంతేగాక, ఐదు నెలలుగా జీతం కూడా ఇవ్వకుండా పని చేయించుకుంటున్నాడు. దీంతో అనిల్ భార్య పవిత్ర మల్లం.. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ సాయం కోరింది. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి సుష్మ.. అనిల్ వివరాలు తెలుసుకుని సౌదీ రాజధాని రియాద్లోని భారత దౌత్యాధికారులకు పంపారు. దీంతో వారు ఈ విషయంపై వివరాలు సేకరిస్తున్నారు.