అమెరికాలో హైదరాబాద్ వైద్యుడి పాఠాలు
హైదరాబాద్: అమెరికా దేశంలో అక్కడి వైద్యులకు పాఠాలు చెప్పిన ఘనతను హైదరాబాద్కు చెందిన వెన్నుపూస వైద్య నిపుణుడు డాక్టర్ సురేష్బాబు దక్కించుకున్నారు. ప్రపంచ స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీలో సురేష్బాబు ఘనతకు పురస్కారం కూడా లభించింది.
చిన్నతనంలోనే వెన్నుపూస వంకర్లుపోయిన చిన్నారులకు ఆ వ్యాధిని సరిచేయడంలో సురేష్ ఖ్యాతినార్జించారు. దీనికోసం కొత్త వైద్యాన్నికూడా ఆయన కనుగొన్నారు. సుమారు 15 మంది చిన్నారులకు వైద్యం చేసి వైద్య విధానాన్ని ధృవీకరించారు.
వెన్నుపూస వైద్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభ కనపరచిన వారిలో ముగ్గురిని ఎంపిక చేసి పురస్కారం అందించడమే కాకుండా, అమెరికాలోని ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పే అవకాశాలు కూడా రీసెర్చ్ సొసైటీ కల్పిస్తుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి అవకాశం పొందిన సురేష్బాబు నాలుగు వారాలపాటు న్యూయార్క్, కాలిఫోర్నియా, కొలంబియా, శాండియాగో, శాన్ప్రాన్సిస్కో విశ్వవిద్యాలయాల్లో వెన్నుపూస వైద్యంపై వివరించారు. అలాగే అక్కడ అమలుచేస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేశారు.
అమెరికాలో 30 వేల డాలర్ల వరకు వెన్నుపూస వైద్యానికి ఖర్చు అవుతుండగా, సురేష్బాబు వైద్యం మాత్రం 1500 డాలర్లకే జరుగుతుండడంపై అమెరికాలో ప్రశంసలు లభించాయి.