అక్రమ సంబంధం: అడ్డుగా ఉందని, భార్య నిద్రపోతుండగా ఎటాక్!..
శుక్రవారం రాత్రి పీకలదాకా తాగి ఇంటికొచ్చాడు. అప్పటికే భార్య నిద్రలో ఉండగా.. గొడ్డలితో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు.
హైదరాబాద్: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కారణంగా.. ఏకంగా భార్యనే హత్య చేశాడు ఓ భర్త. గద్వాల జోగులాంబ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య నిద్రపోతున్న సమయంలో భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
పోలీసుల కథనం ప్రకారం.. పాల్వలి గ్రామానికి చెందిన మహ్మద్ హుస్సేన్(35)కు రజియా బీ అనే మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి తాగుడుకు బానిసైన హుస్సేన్.. తాగొచ్చి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అతని వేధింపులకు తాళలేక పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
రజియా అతన్ని వదిలేసి వెళ్లిపోయాక అదే గ్రామానికి చెందిన వేరే మహిళతో హుస్సేన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అదే మహిళను వివాహం కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం హస్సేన్, రజియాకు చెందిన ఇరు కుటుంబాల పెద్దలు కలగజేసుకున్నారు. ఇద్దరికీ నచ్చజెప్పి కలిసి ఉండాల్సిందిగా చెప్పారు.
పెద్ద మనుషులు నచ్చజెప్పడంతో.. అప్పటినుంచి రజియా తిరిగి భర్తతో కాపురం చేస్తోంది. అయితే ఇటీవలే భర్త అక్రమ సంబంధం గురించి రజియాకు తెలిసిపోయింది. దీంతో అతన్ని నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. అక్రమసంబంధం పెట్టుకున్న మహిళతో వివాహానికి భార్య అడ్డుకుందని హుస్సేన్ భావించాడు.
శుక్రవారం రాత్రి పీకలదాకా తాగి ఇంటికొచ్చాడు. అప్పటికే భార్య నిద్రలో ఉండగా.. గొడ్డలితో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత గదిలో రక్త మరకలు లేకుండా చేసి.. దుస్తులు మార్చుకున్నాడు. ఆ తర్వాత ఓ పురుగుల మందు డబ్బాను రజియా మృతదేహం పక్కనబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు.
విషయం రజియా కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో నిజాలు నిగ్గు తేల్చారు. భార్య రజియాను తానే హత్య చేసినట్లుగా హుస్సేన్ అంగీకరించడంతో.. అతనిపై హత్య కేసు నమోదు చేశారు.