కరోనా మందులను బ్లాక్ మార్కెట్ చేస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో అంతర్రాష్ట బ్లాక్ మార్కెట్ ముఠాను టాస్క్ పోలీసులు అరెస్టు చేశారు. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ఉపయోగించే మందులను బ్లాక్ మార్కెట్ చేస్తున్న 8 మందిని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు.
మందులను బ్లాక్ మార్కెట్ చేస్తున్నారన్న సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. రెమెడిసివర్ లాంటి జనరిక్ మందులతోపాటు ఇతర యాంటీ వైరల్ మందులను వారి వద్ద నుంచి సీజ్ చేశారు.
నిందితుల నుంచి రూ. 35.5 లక్షల విలువ చేసే మెడిసిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో రూ. 55వేల నగదు కూడా ఉంది. కరోనాతో బాధపడుతున్నవారికి ఈ మందులను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
కాగా, తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 36,221 మంది కరోనా బారినపడ్డారు. 12,177 యాక్టివ్ కేసులున్నాయి. 23,679 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాబారిన పడి 365 మంది మరణించారు.