హైదరాబాద్ వరదలు : 3 నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
గత 10 రోజులుగా హైదరాబాద్లో నిత్యం వర్షం కురుస్తూనే ఉంది. ఏ క్షణాన ఎప్పుడు హఠాత్తుగా మబ్బులు కమ్ముకుంటాయో... ఎప్పుడు వాన మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు ఉదయం పూట ఎండ కనిపించినప్పటికీ... హఠాత్తుగా మబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తోంది. వరుసగా కురుస్తున్న ఈ భారీ వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాల్లో రూ.5వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం చాలామంది ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా తన 3 నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా తమవంతుగా తెలంగాణ రాష్ట్రానికి రూ.2కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ప్రకటించింది. ఈ మేరకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు.రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులపై విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో బెంగాల్ తెలంగాణకు అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. బెంగాల్ ఆర్థిక సాయానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు,హైదరాబాద్ వరద బాధితుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి రూ. 10 కోట్లు విరాళం ప్రకటించారు. తెలంగాణకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం పళనిస్వామికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
టాలీవుడ్ హీరోలు సైతం తమవంతుగా సహాయక చర్యలకు భారీ విరాళాలు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ రూ.1కోటిన్నర,మెగాస్టార్ చిరంజీవి రూ. 1 కోటి, నాగార్జున రూ. 50 లక్షలు, ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, మహేష్ బాబు రూ. 1 కోటి,విజయ్ దేవరకొండ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. వీరితో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ రూ.5 లక్షలు, మరో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు.