జనం సొమ్ముతో జల్సాలు: రాధేశ్యాం సంస్థ మోసం రూ.1200కోట్లు కాదు 3వేల కోట్లు!
హైదరాబాద్: సంచలనంలో సృష్టించిన ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్(ఎఫ్ఎంఎల్సీ) సంస్థ మోసాలను పూర్తిస్థాయిలో ఛేదించారు హైదరాబాద్ పోలీసులు. దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ సంస్థలో చేరిన సభ్యుల సంఖ్య 60 లక్షల వరకు ఉన్నట్లు తేల్చారు.
రూ.3వేల కోట్లు కాజేశారు..
అంతేగాక, ఈ 60లక్షల మంది నుంచి సంస్థ ప్రతినిధులు ఏకంగా రూ.3 వేల కోట్ల వరకు వసూలు చేసినట్టు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం తేల్చింది. కూకట్పల్లి వాసి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొద్ది రోజుల క్రితం హర్యానాలోని హిసార్లో సంస్థ సీఎండీ రాధేశ్యాం, డైరెక్టర్ సురేందర్సింగ్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక దర్యాప్తులో ఈ ముఠా సుమారు 20 లక్షల మంది సభ్యుల నుంచి రూ.1200 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
దేశ వ్యాప్తంగా.. 60లక్షలమంది సభ్యులు
కాగా, నిందితుల్ని గత శనివారం కస్టడీకి తీసుకున్న పోలీసులు వారిని హిసార్కు తీసుకెళ్లి మరోసారి సోదాలు జరిపారు. రాధేశ్యాం తన ఇంట్లో రహస్యంగా దాచిన నాలుగు ల్యాప్టాప్లను విశ్లేషించారు. హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో సంస్థలో చేరిన సభ్యులు సుమారు 60 లక్షల మంది ఉన్నట్లు.. వారి నుంచి దాదాపు రూ.3 వేల కోట్లు రాబట్టినట్లు తేల్చారు.
లగ్జరీ కార్లు.. రివాల్వర్ సీజ్
రాధేశ్యాం ఇంట్లో ఉన్న ఆరు సెల్ఫోన్లు, రూ.60 లక్షల నగదు, రివాల్వర్(పది రౌండ్లు), ఫార్చునర్, ఫోర్డ్ ఎండేవర్, జాగ్వార్ కార్లను పోలీసులు సీజ్ చేశారు. పరారీలో ఉన్న సంస్థ ఎండీ భన్సీలాల్, కీలక నిందితులు మనోజ్, సద్బీర్సింగ్ కోసం వేట కొనసాగుతోందని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. గొలుసుకట్టు సంస్థల్లో చేరడం, ఇతరులను చేర్పించడం చట్టవ్యతిరేకమనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు.
జనం సొమ్ముతో జల్సాలు చేశారు
సంస్థ సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బుతో సంస్థ యజమానులు, ప్రతినిధులు విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఖరీదైన కార్లలో తిరగడం, పర్యటనలకు వెళ్లినప్పుడు లగ్జరీ హోటళ్లలోనే బస చేసేవారు. అంతేగాక, నేపాల్, దుబాయ్, అండమాన్ నికోబార్ దీవులు..తదితర ప్రాంతాలకు వెళ్లి విందులు, వినోదాల కోసం అమితంగా ఖర్చు చేశారని చెప్పారు.
మల్టీ లెవల్ మోసం: ఏడో తరగతి చదివి, రూ.1200 కోట్లు ముంచారు, విమానమే కొన్నాడు
మరింత లోతుగా దర్యాప్తు
నిందితుల ఆరు రోజుల కస్టడీ ముగియడంతో గురువారం తిరిగి న్యాయస్థానంలో హాజరుపరిచారు పోలీసులు. అయితే, మరింత సమాచారం రాబట్టేందుకు వీలుగా మరో రెండు వారాల కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై శనివారం న్యాయస్థానం నిర్ణయం వెలువరించనుంది. ఈ సంస్థ స్కాంలో పరారీలో ఉన్న కీలక నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.