జిమ్కు వెళ్లొస్తానని చెప్పి, లిఫ్ట్లో అనుమానిస్తారని: నీట్పై ఓదార్చినా ఆ యువతి ఆత్మహత్య
Recommended Video
హైదరాబాద్: ఇటీవల విడుదలైన నీట్ పరీక్షల్లో మంచి ర్యాంకు రాలేదనే కారణంతో జస్లీన్ కౌర్ అనే 18 ఏళ్ల యువతి అబిడ్స్లోని పదంతస్తుల భవంతి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఈ ఆత్మహత్య కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అందరూ చూస్తుండగా, వద్దని ఎంతోమంది వారిస్తున్నా ఆమె వినకుండా దూకేసింది. కొందరు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
జస్లీన్ కౌర్ తల్లిదండ్రులు రణ్వీర్ సింగ్, లవ్లీసింగ్లు. వీరి కుటుంబం బర్కత్పురలోని ఖైబాన్ అపార్టుమెంట్లో ఉంటోంది. జస్లీన్కు ఇంటర్లో 950 మార్కులు వచ్చాయి. మెడిసిన్ చదవాలనుకుంది. నీట్లో లక్ష కంటే ఎక్కువ ర్యాంకు రావడంతో ఆ అవకాశాన్ని కోల్పోయింది. సోమవారం ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి బాధతోనే ఉంది. మంగళవారం ఉదయం జిమ్కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి స్కూటీలో బయటకు వచ్చింది. ఉదయం పది గంటల సమయంలో అబిడ్స్లోని మయూర్ కుషాల్ కాంప్లెక్స్ వద్దకు వచ్చింది.
రక్షించేందుకు కొందరు లిఫ్ట్లో పైకి వెళ్లారు కానీ
పది అంతస్తుల భవనం ఎక్కి దూకేందుకు యత్నిస్తుండగా రోడ్డుపై ఉన్న యువకులు, మహిళలు దానిని గమనించారు. దూకవద్దని గట్టిగా అరిచారు. కొందరు రక్షించేందుకు లిఫ్టులో భవనం పైకి వెళ్లారు. కానీ ఈ లోగానే ఆమె దూకేసింది. కళ్లముందే ఆమె దూకేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తల వెనుక బలమైన గాయాలు, మెదడు దెబ్బతినడం, కాళ్లు, చేతులు, పక్కటెముకలు విరిగిపోయి రక్తస్రావమవడం వల్ల ఆమె మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తల్లి ఓదార్చినా స్వాంతన లేదు
ఆమె ఇంట్లో చెప్పి వచ్చిన తర్వాత ఆ భవనంపై స్కూటీని పార్క్ చేసింది. పైకి వెళ్లిన తర్వాత అందరూ వద్దని అరుస్తుండగా ఆమె కళ్లు మూసుకొని కిందకు దూకేసింది. నీట్లో మంచి ర్యాంకు రాలేదని ఆ యువతి తల్లి వద్ద కంటతడి పెట్టింది. కానీ ఆ తల్లి ఆమెను ఓదార్చింది. మరోసారి ప్రయత్నిస్తే మంచి ర్యాంకు వస్తుందని ధైర్యం చెప్పింది. తల్లి ధైర్యం చెప్పినా జస్లీన్కు స్వాంతన చేకూరలేదు. ఒత్తిడిలో అఘాయిత్యానికి పాల్పడి కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. పరీక్షలు బాగానే రాసినట్లు నీట్ రాసిన అంతరం తల్లిదండ్రులతో సహా అందరికీ చెప్పింది.
లిఫ్టులో ఎక్కితే అడుగుతారని
భవనంలోకి నాలుగు దారులు ఉన్నాయి. చివరి దారిలో నుంచి లోనికి వెళ్లింది. లిఫ్టులో వెళ్తే ఎవరైనా అనుమానంతో ప్రశ్నిస్తారని జస్లీన్ పది అంతస్తులను మెట్ల ద్వారా ఎక్కిందని తెలుస్తోంది. ఆరో అంతస్తు వద్ద సీసీ కెమెరాలో అమె మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు ఉన్నాయి. పది అంతస్తుల తర్వాత భవనం పైభాగానికి వెళ్లేందుకు రెండు గేట్లు ఉన్నాయి. మరమ్మతుల కారణంగా రెండింటిని తెరిచే ఉంచారు. ఒకదాని గుండా ఆమె భవనం పైకి ఎక్కింది. ఇప్పటి వరకైతే ఆమె మరణంపై అనుమానాలు లేవని పోలీసులకు చెప్పారు. తల్లిదండ్రులు హైదరాబాద్లో లేరు. వారు వచ్చి అనుమానాలు వ్యక్తం చేస్తే దర్యాప్తును ఆ దిశగానూ కొనసాగిస్తామని పోలీసులు మంగళవారం తెలిపారు.
ఉదయం వెళ్లి రాకపోవడంతో ఆందోళన
జస్లిన్ భవనం పై నుంచి దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉదయం వెళ్లిన జస్లిన్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు చెందారు. ఆమె ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆందోళనకు లోనయ్యారు. చిన్నాన్న సురేందర్ సింగ్ కాచిగూడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతలో కొందరి వాట్సాప్ గ్రూప్ ద్వారా జస్లిన్ విషయం తెలియడంతో వారు కుప్పకూలిపోయారు. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లారు. ఆమె మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
కాచిగూడ, బర్కత్పురలో ఎత్తైన భవనాలు ఉన్నప్పటికీ.. అబిడ్స్కు
ఎత్తైన ప్రదేశం నుంచి దూకితే వెంటనే చనిపోతామన్న ఉద్దేశ్యంతో ఆమె ఆ భవనాన్ని ఎంచుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బర్కత్పుర, కాచిగూడలలో ఎత్తైన భవనాలు ఉన్నప్పటికీ తెలిసిన వాళ్లు ఉండటం, ఎక్కువగా కుటుంబాలు ఉండటంతో.. అబిడ్స్ అయితే ఉదయం ఎక్కువ మంది ఉండరని భావించి ఉంటారని భావిస్తున్నారు. భయం లేకుండా చనిపోవడానికే సిద్ధమై ముందుగా ప్రణాళిక చేసుకొని కుటుంబంలో విషాదం నింపిందని చెబుతున్నారు.