తల్లిదండ్రుల ముఖం చూడను: పూర్ణిమ, ఎందుకంటే?, నేటి రాత్రికి నగరానికి..
హైదరాబాద్: నగరంలో అదృశ్యమై ముంబైలో ప్రత్యక్షమైన పూర్ణిమ సాయి (15) కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పుట్టిన రోజు నాడే కూతురు ఆచూకీ దొరికిందని సంబరపడిపోయిన తల్లిదండ్రులకు పూర్ణిమ మాటలతో హతాశులయ్యారు. ఆచూకీ తెలిసిన వెంటనే ముంబైకి వెళ్లిన తల్లిదండ్రులకు.. తాను ఇంటికి తిరిగి రాలేనంటూ పూర్ణిమసాయి స్పష్టం చేయడంతో వారు నిశ్చేష్టులయ్యారు.
హైదరాబాద్ పూర్ణిమ ముంబైలో ప్రత్యక్షం: సినిమాల కోసమేనా? ఏం జరిగింది?
నిరాశలో తల్లిదండ్రులు..
కనీసం వారిని కలిసేందుకు కూడా పూర్ణిమ విముఖత చూపిన క్రమంలో ఫోన్లోనే కుమార్తెతో మాట్లాడిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో నగరానికి తిరిగివచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడి జువెనైల్ జస్టిస్ బోర్డు ఆదేశాల మేరకు పూర్ణిమసాయిని సైబరాబాద్ పోలీసులకు సోమవారం సాయంత్రం అప్పగించారు.
రోడ్డు మార్గం గుండా హైదరాబాద్కు
ఈ క్రమంలో పూర్ణిమను మంగళవారం ఉదయం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ తీసుకువస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు ఆమె నగరానికి చేరుకోనున్నారు. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్లో పూర్ణిమసాయి అపహరణ కేసు నమోదై ఉన్నందున బాలికను కూకట్పల్లి న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు.
అలా చేస్తే.. తల్లిదండ్రులకు ప్రాణం సంకటం
పూర్ణిమసాయి ముంబైలో ఉన్నట్లు సమాచారం అందడంతో బాచుపల్లి ఎస్సై శంకర్ నేతృత్వంలో బాలిక తల్లిదండ్రులు సోమవారం ఉదయం విమానంలో ముంబైకి చేరుకున్నారు. పూర్ణిమ ఆశ్రయం పొందిన దాదర్లోని దొంగరి బాలసుధార్ హోంకు వెళ్లారు. అయితే తాను తల్లిదండ్రులతో ఎట్టిపరిస్థితుల్లోనూ మాట్లాడనని పూర్ణిమ తేల్చి చెప్పింది. తల్లిదండ్రుల ముఖం చూడటానికీ ఆమె నిరాకరించినట్లు సమాచారం. ఈ విషయంలో దాదర్లోని జువైనల్ హోం అధికారులు పూర్ణిమకు నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. పూర్ణిమ తల్లిదండ్రులతో మాట్లాడని మాట వాస్తవమేనని బాచుపల్లి సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపారు. తల్లిదండ్రుల మొహం చూస్తే వారికి అరిష్టం(చనిపోతారని) కలుగుతుందని సాయిబాబా తనకు కలలో సాక్షాత్కరించి చెప్పాడని పూర్ణిమ చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏడాదిపాటు తాను తన తల్లిదండ్రుల ముఖం చూడకూడదని, అందుకే తాను ఇంట్లో నుంచి పారిపోయానని పూర్ణిమ తెలిపినట్లు చెప్పారు.
ముంబైకి ఎలా వెళ్లింది..
తొమ్మిదో తరగతి చదువుతున్న పూర్ణిమ సాయి జూన్ 7న బాచుపల్లి నుంచి అదృశ్యమైన తర్వాత సికింద్రాబాద్లో రైలు ఎక్కి షిర్డీ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కొద్దిరోజులపాటు అక్కడే ఉన్న ఆమె.. షిర్డీసాయి దర్శనం అనంతరం ముంబైలో అనాథాశ్రమాల గురించి ఆరా తీసింది. తర్వాత దాదర్ వెళ్లి బాలసుధార్ హోంలో చేరింది. తానో అనాథనని, తన పేరు అనికాశ్రీ అని, తాను ఇన్నాళ్లు సికింద్రాబాద్ తుకారాంగేట్లోని అనాథశ్రమంలో ఉండి వచ్చానని తెలిపింది. పూర్ణిమసాయి చెప్పిన వివరాల్ని హోం నిర్వాహకులు అక్కడి పోలీసులకు వివరించారు. అక్కడి పోలీసులు తుకారాంగేట్ పోలీసులకు చిత్రంతో సహా వివరాలు అందించడంతో బాలిక ఆచూకీ తెలిసింది.
సినిమాలపై అమితాసక్తితో.. అనికాశ్రీగా
అనికాశ్రీగా పూర్ణిమసాయి పేరు మార్చుకోవడం వెనక ఆసక్తికర కోణం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో నటించాలనేది ఆమెకు బలమైన కోరిక. ఇదే విషయమై పలుమార్లు తల్లిదండ్రులతో చర్చించినట్లు సమాచారం. చదువుకోవాల్సిన సమయంలో సినిమా మాటేంటని వారు అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో సినిమాలపై ఆసక్తిని వదులుకోని పూర్ణిమ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాల్లో సినీనటులను అనుకరిస్తూ వీడియోలు రూపొందించిందని తెలుస్తోంది. వాటిని సోషల్ మీడియాలో పెడుతూ వాటికి వచ్చే లైక్స్, కామెంట్స్ చూసి పొంగిపోయేది. రజినీకాంత్ నటించిన కబాలి సినిమాలోని ‘కబాలి రా' అనే డైలాగ్ను ఆమె డబ్స్మాస్ చేసింది. కాగా, బాలీవుడ్ సీరియల్కు చెందిన ఓ సీరియల్పై పూర్ణిమ అమితాసక్తిని పెంచుకున్నట్లు...అందులోని ప్రధాన నాయిక ‘అనిక' పాత్ర అంటే పూర్ణిమకు ఇష్టమని తెలుస్తోంది. అందులో భాగంగానే దాదర్లోని ఆశ్రమంలోచేరడానికి పూర్ణమ తన అసలు పేరుకు బదులు అనికాశ్రీ అని చెప్పి ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆమె ఆచూకీ దొరికి, ఆమెను హైదరాబాద్ తీసుకొస్తుండటంతో ఆమె తల్లిదండ్రుల్లో కొంత ఆనందం కనిపిస్తున్నప్పటికీ వారి ముఖం చూడలేనంటూ భీష్మించుకున్న పూర్ణిమను తలచుకుని వారు కుమిలిపోతున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత పూర్ణిమ తన తల్లిదండ్రుల వద్దకు వెళుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది.