నాలుగేళ్లకు జగన్ ఈ కారణం కనుగొన్నారు: హైకోర్టు తీవ్రంగా.., పాదయాత్రపై షాక్
అక్టోబర్ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న వైసిపి అధినేత వైయస్ జగన్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ఉన్న కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
Recommended Video
హైదరాబాద్: అక్టోబర్ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న వైసిపి అధినేత వైయస్ జగన్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ఉన్న కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
ప్రతి శుక్రవారం హైదరాబాదులోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ను గురువారం కొట్టివేసింది.
దిమ్మతిరిగే షాక్: పవన్ కళ్యాణ్పై విమర్శలా, ఇవి కనిపించడంలేదా?
'తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పిటిషనర్ జగన్పై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఒకవేళ ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపునిస్తే పాదయాత్ర వంటి రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దుర్వినియోగం చేసే అవకాశాన్ని కొట్టివేయలేం. కోర్టులో హాజరు మినహాయింపు కోరడానికి నాలుగేళ్ల తరువాత ఆకస్మికంగా వైసిపి పార్టీ అధ్యక్షుడిగా పాదయాత్ర అనే కారణాన్ని కనుగొన్నారు.' అని హైకోర్టు పేర్కొంది.
ఇదీ జగన్ పిటిషన్
ప్రజాప్రతినిధిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా తాను జనంలోకి వెళ్లవలసి ఉందని, పాదయాత్ర కూడా చేయాల్సి ఉందని, అందువల్ల అన్ని ఛార్జీషీట్లలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని జగన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ సత్యనారాయణ మూర్తి విచారణ జరిపారు. అభ్యర్థనను తిరస్కరించారు.
హాజరు మినహాయింపు కోసమే తెరపైకి పాదయాత్ర
ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందించారు. జగన్ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లుగా అభియోగాలున్నాయని, విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే ఆయన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే అవకాశముందని, నిజానికి హాజరు మినహాయింపు కోసమే పాదయాత్రను తెరపైకి తెచ్చినట్లు ఉందని, నాలుగేళ్ల తర్వాత పాదయాత్ర పేరుతో ఆకస్మికంగా హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారని వ్యాఖ్యానించారు.
బెయిల్ అందుకే వచ్చిందని గుర్తు చేసిన హైకోర్టు
ప్రతి విచారణకు హాజరు కావాల్సిందే అనే షరతు పైనే జగన్కు బెయిలు లభించిందని హైకోర్టు గుర్తు చేసింది. జగన్ తీవ్ర ఆర్థిక నేరాలపై అభియోగాలు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతాయని, ఎక్కువ కాలం శిక్షలు విధించే అవకాశమున్న నేరాల్లో నిందితునిగా హాజరు తప్పనిసరి అని పేర్కొన్నారు. అయితే, కారణాలను బట్టి హాజరుకు మినహాయింపు ఇవ్వాలా లేదా అన్నది కింది కోర్టు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
రాష్ట్రమంతా తిరుగుతూనే ఉన్నారు
క్విడ్ ప్రోకో కేసుల్లో బెయిలు పొందిన తర్వాత జగన్ రాష్ట్రమంతా తిరుగుతూ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారని హైకోర్టు గుర్తు చేసింది. అవసరమైనప్పుడు కింది కోర్టు ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకుంటూనే ఉన్నారని, ఆ అవకాశం ఆయనకు ఇప్పటికీ ఉంటుందని పేర్కొంది.
మాకేం చెప్పలేదు
అప్పుడుఈ పిటిషన్లను తోసిపుచ్చిన సందర్భాలేవీ తన ముందు ప్రస్తావించలేదని పేర్కొంది. పాదయాత్ర పేరుతో ఇప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి పూర్తిగా మినహాయింపు కోరడం సరికాదని అని హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయంగా ఎదిగేందుకు కేసుల్లో విచారణకు హాజరుకాకుండా తప్పించుకోలేరని తెలిపింది.
మిగిలిన ఆరు రోజుల్లో రాజకీయాలు
వారంలో శుక్రవారం మాత్రమే ప్రత్యేక కోర్టుకు రావాలని, మిగిలిన ఆరు రోజులు ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చునని సూచించారు. ఇదిలా ఉండగా సిబిఐ దాఖలు చేసిన మొదటి చార్జిషీట్ సీసీ నెంబర్ 8/2012లో మాత్రమే గతంలో హైకోర్టు జగన్ వ్యక్తిగత హాజరునకు మినహాయింపునిచ్చింది. ఇప్పుడు జగన్ పిటిషన్ కొట్టివేయడంతో జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే.