డేంజర్ జోన్లో హైదరాబాద్, కరోనా కేసులు పెరగడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న 499 పాజిటివ్ కేసులు రికార్డు కాగా.. హైదరాబాద్లోనే 329 కేసులు వెలుగుచూశాయి. గత కొన్నిరోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 180 నుంచి 300 వరకు కేసులు పెరిగాయి. అయితే హైదరాబాద్లో కరోనా వైరస్ కేసులు పెరగడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకు కేసులు పెరుగుతోన్న.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.
హైదరాబాద్ పోలీసులపై కరోనా పంజా.. ముగ్గురు ఉన్నతాధికారులకు..?
దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ నగరం డేంజర్ జోన్లో ఉంది అని కిషన్ రెడ్డి వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడం లేదని, మాటలకే పరిమితమైందని దుయ్యబట్టారు. కరోనా వైరస్ టెస్టులు కూడా చేయడం లేదు అని విమర్శించారు. లక్ష 14 వేల ఎన్ 95 మాస్కులు, 2 లక్షల 31 వేల పీపీఈ కిట్లను తెలంగాణ రాష్ట్రానికి పంపించామని తెలిపారు. కానీ వైరస్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల కబంధ హస్తాల్లో చిక్కుకొందని కిషన్ రెడ్డి ఆరోపించారు. వారి బరినుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. గత ఆరేళ్ల నుంచి కేసీఆర్ పాలనలో తెలంగాణ మగ్గిపోయిందని.. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఒక కుటుంబం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.