ఇక తెలంగాణలోనే మెట్రో రైళ్ల తయారీ: రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్, హరీశ్ రావు భూమి పూజ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ తోపాటు మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి గురువారం భూమి పూజ చేశారు.
అనుమానాలు పటాపంచలు..
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు రావు అనే అనుమానాలతో ఆరేళ్ల క్రితం రాష్ట్రం ఆవిర్భించిందని, అయితే, రైల్వే కోచ్ లు మాత్రమే కాదు, హెలికాప్టర్ విడి భాగాలు కూడా రాష్ట్రంలోనే తయారవుతున్నాయని తెలిపారు.
మెట్రో రైళ్లు కూడా తెలంగాణలోనే తయారు..
మెట్రో రైళ్లను ఇంతవరకు కొరియా నుంచి తెచ్చుకుంటున్నామని, ఇకమీదట తెలంగాణలోనే తయారుకాబోతున్నాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ స్వయం సమృద్ధి సాధించిన రాష్ట్రం కావాలని ఆకాంక్షించారు. మేధా సంస్థ దేశాన్ని ఆకర్షించే విధంగా అభివృద్ధి చెందినందుకు తెలంగాణ పౌరుడిగా గర్వపడుతున్నట్లు తెలిపారు. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించే రైళ్లు అందుబాటులోకి వస్తే పౌరుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని మంత్రి వ్యాఖ్యానించారు.
100 ఎకరాల్లో 800 కోట్ల వ్యయంతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..
రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ తీసుకొచ్చామని చెప్పిన ఆయన.. పెట్టుబడులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ వివరించారు. కాగా, 100 ఎకరాల్లో 800 కోట్ల వ్యయంతో ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం కానుందని తెలిపారు. అనంతరం శంకర్పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి కేటీఆర్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ ఛైర్మన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.