అత్త వివాహేతర సంబంధం... అల్లుడికి వేధింపులు... తట్టుకోలేక ఆత్మహత్య...
అత్త వివాహేతర సంబంధం ఓ అల్లుడి ప్రాణాలను బలిగొన్నది. కొత్తగా పెళ్లయిన ఆ యువకుడు అత్త,ఆమె ప్రియుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లోని మీర్పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తూటిపేట తండాకు చెందిన అంగోతు బాబు(25),చందంపేట మండలం తెల్దార్ పల్లికి చెందిన యువతికి ఎనిమిది నెలల క్రితం పెళ్లి జరిగింది. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న బాబు భార్య నిర్మలతో కలిసి నందనవనం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇదే క్రమంలో నిర్మల తల్లి విజయ(40) శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు బాబుకు తెలిసింది. అంతేకాదు,ఆమె అతనితో కలిసి తన ఇంటికి వస్తున్నట్లు తెలుసుకున్నాడు.
ఈ విషయంపై బాబు-నిర్మలకు మధ్య గొడవ జరిగింది. విషయం విజయకు తెలియడంతో ప్రియుడితో కలిసి ఆమె బాబును బెదిరించింది. ఈ నేపథ్యంలో బాబు పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టి అత్త బెదిరింపుల గురించి చెప్పాడు. పెద్ద మనుషులు మందలించినప్పటికీ అత్త ప్రవర్తనలో మార్పు రాలేదని తెలుస్తోంది. పైగా దాన్ని అవమానంగా భావించిన అత్త,ఆమె ప్రియుడు బాబును మళ్లీ ఫోన్లో వేధించడం మొదలుపెట్టారు. మరోవైపు భార్య కూడా అతనితో గొడవ పడి తల్లి వద్దకు వెళ్లిపోయింది.
అత్త వేధింపులు,భార్యతో గొడవలతో కలత చెందిన బాబు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం బాబు తమ్ముడు జబ్బార్ ఇంటికొచ్చి చూసేసరికి లోపల సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. బాబు ఆత్మహత్యపై అతని తండ్రి రాము పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్త,ఆమె ప్రియుడి వేధింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు మృతుడి భార్య నిర్మల తనకేమీ తెలియదని... ఇలా ఆత్మహత్యకు పాల్పడుతాడని అనుకోలేదని పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.