థియేటర్ లో జాతీయగీతం వస్తుంటే.. కూర్చునే ఉన్నారు.. అరెస్ట్ అయ్యారు
థియేటర్ లో జాతీయ గీతం ప్రదర్శిస్తున్న సమయంలో సీటులోంచి లేచి నిలబడనందుకు ఇద్దరు వ్యక్తుల ను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: థియేటర్ లో జాతీయ గీతం ప్రదర్శిస్తున్న సమయంలో సీటులోంచి లేచి నిలబడనందుకు ఇద్దరు వ్యక్తుల ను పోలీసులు అరెస్టు చేసిన ఘటన హైదరాబాద్ లోని కాచిగూడలో చోటు చేసుకుంది.
సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రసారమయ్యే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే తెలుగింటి సీతమ్మ అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'చిత్రాంగద'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కాచిగూడలోని ఐనాక్స్ థియేటర్ లో ఈ చిత్రం ప్రదర్శన సమయంలో ఈ ఘటన జరిగింది.
సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం వస్తోంది. ఆ సమయంలో అందరూ లేచి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నప్పటికీ సయిద్ షఫీ హుస్సేన్, మహ్మద్ ఇలియాస్ అనే ఇద్దరు వ్యక్తులు మాత్రం తమ సీట్లలో కూర్చేనే ఉన్నారు.
ఆ పక్కనే ఉన్న టీవీ జర్నలిస్ట్ ఎ.సంపత్ వారిని నిల్చోవాల్సిందిగా కోరినా వారు ఖాతర చేయలేదు. ఈ విషయమై సంపత్ పోలీసులకు సమాచారం అందించగా, సుల్తాన్ బజార్ పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే వారిలో హుస్సేన్ అనే వ్యక్తి తన కాలు నొప్పిగా ఉండడం వల్ల నిలబడలేకపోయినట్లు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.