అమ్మాయిల కోసం లక్షలు ఖర్చు: లవర్ కోసం విమానాల హైజాక్ చేసిన వంశీ ముదురు
ప్రియురాలి కోసం విమానాలను హైజాక్ చేస్తానని మెయిల్స్ పంపిన వంశీకృష్ణ గురించి ఎన్నో షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. యువతులకు వల వేయడం, విమానాల్లో విహరించడం వంటివి చేసేవాడు.
హైదరాబాద్: ప్రియురాలి కోసం విమానాలను హైజాక్ చేస్తానని మెయిల్స్ పంపిన వంశీకృష్ణ గురించి ఎన్నో షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. యువతులకు వల వేయడం, విమానాల్లో విహరించడం వంటివి చేసేవాడు.
హైజాక్?: ప్రియురాలి కోసం విమానాలను నిలిపేసిన హైదరాబాదీ యువకుడు
అతని పేరు మొటపర్తి వంశీకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామం. ఉపాధి నిమిత్తం ఏళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చాడు. ట్రావెల్ ఏజెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఫేస్బుక్, వాట్సాప్లతో యువతులను వలలో వేయడం
ప్రియురాలిని నమ్మించేందుకు విమానాల హైజాక్ పేరుతో నాటకం ఆడి జైలు పాలయ్యాడు. చెన్నైకి చెందిన ఓ యువతికి తప్పుడు టిక్కెట్లు పంపించాడు. దీంతో హైజాక్ అనే తప్పుడు సమాచారం ఇచ్చి, అరెస్ట్ అయ్యాడు. యువతులను వలలో వేసుకోవడం ఇతనికి అలవాటు. ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా యువతులతో చాటింగ్ చేస్తుండేవాడు.
అమ్మాయిల్ని విమానాల్లో వారాంతపు విహారాలకు..
ఆసక్తి ప్రదర్శించిన వారిలో కొందరిని ఎంచుకుని వారంతాల్లో విందులకు ఆహ్వానించడం, బెంగళూరు, ఢిల్లీ, ఆగ్రా, ముంబై, చెన్నై, గోవాలకు విమానాల్లో తీసుకెళ్లడం వారం పాటు వారితో గడిపిరావడం చేసేవాడు. గత రెండేళ్లుగా ఇదే పని చేసేవాడు.
గతంలో జైలుపాలు
జల్సాలకు అవసరమైన డబ్బు కోసం రెండుసార్లు నేరాలు చేసి జైలుకు వెళ్లాడు. నాలుగేళ్ల క్రితం కొందరిని మోసం చేసి, రూ.6 లక్షలు స్వాహా చేశాడు. జైల్లో పెట్టినా బెయిల్పై వచ్చి మళ్లీ యువతులకు వల వేస్తూనే ఉన్నాడు.
పబ్బుల్లో మాటామంతి
వంశీకృష్ణ ఖాళీ సమయాల్లో ఫేస్బుక్, వాట్సప్ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్ నగరాల్లో ఉంటున్న యువతులతో చాటింగ్ చేస్తున్నాడు. వారితో మాట్లాడేటప్పుడు తనకు కొత్త ప్రదేశాలు చూడటం, సముద్రతీరాలకు వెళ్లడం ఇష్టమని వారితో చెబుతాడు.
విందు ఆ తర్వాత డేటింగ్
తన అనుభవాలు వారితో చెప్పుకొన్నాక ఆసక్తి ప్రదర్శించిన యువతులతో ఫోన్లో మాట్లాడి, విందుకు ఆహ్వానిస్తాడు. ఇందుకోసం వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి, పబ్బులకు తీసుకెళ్తున్నాడు. రెండు, మూడుసార్లు ఇలా కలుసుకున్నాక డేటింగ్కు వెళ్దామంటూ ప్రతిపాదిస్తున్నాడు. అంగీకరించిన వారితో విమానాల్లో వివిధ నగరాల్లో వారం పాటు గడిపి వస్తాడు.
ఏడాదిలో 9 మంది యువతుల్ని పడేశాడు
ఏడాది వ్యవధిలో హైదరాబాద్కు చెందిన ఆరుగురు యువతులు, ఇద్దరు బెంగళూరు యువతులు, వైజాగ్ యువతితో కలిసి వెళ్లొచ్చాడు. వంశీకృష్ణకు పెళ్లైనా సరే యువతులతో విందు, వినోదాలకు వెళ్తాడు.
అమ్మాయిల కోసం భారీగా ఖర్చు, ఆస్తి కరిగిపోయింది
యువతులతో వారాంతాలు ఖుషీగా ఉండేందుకు రూ.వేలల్లో ఖర్చు చేయడంతో వంశీకష్ణ ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. తండ్రి ప్రసాద్ కాంట్రాక్టర్గా సంపాదిస్తుండగా, వంశీకృష్ణ దాన్ని విలాసాలకు ఖర్చు పెడుతున్నాడు.
రెండేళ్లలో దాదాపు ఇరవై లక్షలు ఖర్చు
రెండేళ్ల క్రితం అతడి తండ్రి బేగంపేటలో ఓ భవనాన్ని విక్రయించగా రూ.80 లక్షలొచ్చాయి. ఇందులో రూ.50 లక్షలు మదుపుచేయగా, మిగిలిన రూ.30 లక్షలు వంశీకృష్ణ పేరుమీద బ్యాంకులో ఉంచారు. వంశీకృష్ణ ఈ డబ్బును రెండేళ్లలో 70 శాతానికి పైగా ఖర్చు చేశాడు. తండ్రి ప్రసాద్ తీవ్రంగా మందలించి, మిగిలిన డబ్బును ఖర్చు చేయకుండా కట్టడి చేశాడు.
దూరం పెట్టిన తండ్రి
మియాపూర్లో తన ఇంటి నుంచి దూరంగా ఉండాలంటూ ఆదేశించి నిజాంపేటలో రెండు నెలల క్రితం ఒక ఇల్లు చూశాడు. అందులో వంశీకృష్ణ, అతడి భార్యను ఉంచారు.
ట్రావెల్ ఏజెంట్గా డబ్బులు సరిపోక మోసాలు
విందు, వినోదాలకు యువతులతో వారాంతాల్లో వెళ్లేందుకు డబ్బు లేకపోవడంతో నిందితుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ట్రావెల్ ఏజెంట్గా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు.
అలవాటే..
ఫేస్బుక్లో పరిచయమైన యువతులతో సరదా ట్రిప్స్కు గోవాకు వెళ్లడం వంశీకి అలవాటుగా చెబుతున్నారు. కానీ ఈసారి డబ్బు లేకపోవడంతో హైజాక్ డ్రామా ఆడాడు. పోలీసుల చేతికి చిక్కాడు. అతడిపై 2010లో నకిలీ టిక్కెట్ల విక్రయం కేసు, 2013లో మ్యారేజ్ బ్యూరో నిర్వహణ పేరుతో రూ.6 లక్షలు మోసగించిన కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.