మావోయిస్టుల్లో స్వార్థం పెరిగిపోయింది, నాటి విలువల్లేవు: పురుషోత్తమ్ లొంగుబాటు
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ నాయకత్వంలో స్వార్థం పెరిగిపోయిందని, మానవ సంబంధాలు పార్టీకి దూరమయ్యాయని పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పురుషోత్తమ్ అన్నారు. మంగళవారం తన భార్య, మహిళా మావోయిస్టు వినోదినితో కలిసి ఆయన హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఈ సందర్భంగా పురుషోత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ వైపు మావోయిస్టు అగ్ర నాయకత్వం నిర్లక్ష్యం చేయడం.. మరోవైపు ఆరోగ్యం సహకరించకే లొంగిపోయినట్లు పురుషోత్తమ్ తెలిపారు. తాను 1969, 1972లో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నానని.. రామకృష్ణ, గణపతితో 25ఏళ్లుగా కలిసే తిరిగినట్లు పురుషోత్తమ్ తెలిపారు.
మావోయిస్టు అగ్రనాయకత్వంలో 20ఏళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేదని.. ఇప్పుడు వారిలో స్వార్థం పెరిగిపోయిందన్నారు. పదేళ్లుగా తమను నిర్లక్ష్యం చేశారని.. అగ్ర నాయకత్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు.
తమను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. వినోదిని ఆరోగ్యం దెబ్బతిన్నా పట్టించుకోలేదని.. కనీసం ఆమె చేతివంట తిన్న విశ్వాసం కూడా వారికి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ప్రతినిధులను హత్య చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పరిపాలన బాగుందని అన్నారు.