హైదరాబాద్ మేయర్కు కరోనా పాజిటివ్: మహమ్మారికి ఎవరూ అతీతులు కాదంటూ ఈటెల
హైదరాబాద్: మహమ్మారి కరోనాకు ఎవరూ అతీతులు కారనీ, అది అందరికీ సోకుతుందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కరోనాకు సీజనల్ వ్యాధులు కూడా తోడవుతున్నాయని ఆయన తెలిపారు.
81శాతం మందికి కరోనా సోకిందని కూడా తెలియదు
జిల్లాల్లో సమస్యలు తెలుసుకోవడానికి సమీక్షలు చేపడుతున్నామని మంత్రి ఈటెల వెల్లడించారు. కరోనా వచ్చిన తర్వాత ప్రపంచమంతా అప్రమత్తమైందన్నారు. కరోనా ప్రభావం ఎలా ఉంటుందో డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్కు కూడా తెలియలేదని, కానీ వారిచ్చిన సలహాలను పాటించామని తెలిపారు. 81 శాతం మంది కూడా ఈ వైరస్ సోకినట్లు కూడా తెలియదని, కరోనా బారినపడిన వారికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలకు మించదని అన్నారు.
లక్షణాలు ఎక్కువగా ఉంటేనే గాంధీకి..
తీవ్రత ఉండి ఆస్పత్రికి వెళ్లినప్పుడే ఖర్చు అవుతోందని తెలిపారు. ర్యాపిడ్ టెస్టులు చేయడంలో ఆలస్యమైందని, ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచామని వివరించారు. హోం ఐసోలేషన్ పంపే ముందు ఇంట్లో ఉన్న వారి వివరాలు పూర్తిగా తనిఖీ చేయాలని, లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ ఐసోలేషన్లో ఉంచమని అధికారులకు ఆదేశించారు. లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని గాంధీ లేదా నిజామాబాద్ ఆస్పత్రికి పంపించాలని తెలిపారు. అవసరం ఉన్న చోట ఆక్సిజన్, వెంటిలేటర్ వసతి కల్పిస్తామన్నారు.
భయపడేవారికి భరోసా కల్పించాలి..
కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, 31వ తేదీలోపు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ఇవాళ చనిపోయిన వ్యక్తిని కుటుంబసభ్యులు ముట్టుకునే పరిస్థితి లేదని, కానీ వైద్యులు, మున్సిపల్ సిబ్బందే అంత్యక్రియలు చేస్తున్నారని గుర్తు చేశారు. కరోనా పట్ల భయపడే ప్రజలను భరోసా కల్పించడం అందరి బాధ్యతని, అలా చేయకుండా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Recommended Video
హైదరాబాద్ మేయర్కు కరోనా పాజిటివ్..
ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్కు కరోనా పాజిటివ్ అని తేలింది. లక్షణాలు లేకపోయినా తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కొన్ని రోజులుగా ఆయన హోంక్వారంటైన్లో ఉంటున్నారు. తాజాగా విధుల నిర్వహణకు వెళ్లిన సమయంలో ఓ టీ దుకాణంలో మేయర్ టీ తాగారు. అయితే, టీ దుకాణం నిర్వాహకుడికి కరోనా సోకిందని తెలియడంతో మేయర్ కు మూడోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. గతంలో రెండుసార్లు ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 54,059 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,12,264 యాక్టివ్ కేసులున్నాయి. 41,332 మంది కరోనా నుంచి కోలుకున్నారు.463 మంది కరోనాతో మరణించారు.