హైదరాబాద్లో విషాదం... లేక లేక 14 ఏళ్లకు పుట్టిన కొడుకు... వైద్యుల నిర్లక్ష్యానికి బలి..
హైదరాబాద్లోని పంజాగుట్టలో విషాదం చోటు చేసుకుంది. ఓ కంటి ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఒక ఇంజక్షన్కు బదులు మరో ఇంజక్షన్ ఇవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు కొద్దిసేపటికే మరణించాడు. జాగుట్టలోని ఉన్న అగర్వాల్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
కంటి పరీక్షల నిమిత్తం తల్లిదండ్రులు ఆ బాలుడిని మంగళవారం(జనవరి 26) అగర్వాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల సందర్భంగా వైద్యులు పొరపాటున ఒక ఇంజక్షన్కు బదులు మరో ఇంజక్షన్ను బాలుడికి ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మృతి చెందాడు. వివాహమైన 14 ఏళ్లకు లేక లేక పుట్టిన కుమారుడు ఇలా వైద్యుల నిర్లక్ష్యానికి బలైపోవడం ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. కుమారుడిని విగతజీవిగా చూసి ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
గతేడాది హైదరాబాద్లోని గాయత్రిహిల్స్లో ఉన్న శ్రీరామ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది.జానకి అనే మహిళకు డెలివరీ చేసిన వైద్యులు... ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైద్యురాలు సెల్ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ ఆపరేషన్ చేయడంతో జానకి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు వైద్య సిబ్బందిపై కేసు నమోదు చేశారు.