హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలపై స్పష్టత: భారీ భద్రత
నగరవాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ఈ నెల 28వ తేదీన పరుగులు పెట్టనుంది. శనివారంనాడు మంత్రులు కెటి రామారావు అందులో ప్రయోగాత్మక ప్రయాణించడానికి సిద్ధపడ్డారు.
హైదరాబాద్: నగరవాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ఈ నెల 28వ తేదీన పరుగులు పెట్టనుంది. శనివారంనాడు మంత్రులు కెటి రామారావు అందులో ప్రయోగాత్మక ప్రయాణించడానికి సిద్ధపడ్డారు. మెట్రో రైలు చార్జీలపై కూడా స్పష్టత వచ్చినట్లు సమాచారం.
రైల్వే స్టేషన్లలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. వెండింగ్ మిషన్లు పెట్టారు. మెట్రో రైలు కనీస చార్జీని పది రూపాయలుగా నిర్ణయించారు. తొలుత 12 రూపాయలుగా నిర్ణయించాలని అనుకున్నప్పటికీ పది రూపాయలకే స్థిరపరిచారు. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు రూ. 25 నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మెట్రోరైలు ప్రారంభించేందుకు ఈనెల 28వ తేదీన ముహూర్తం ఖరారు కావడంతో పోలీసులు భద్రతపై దృష్టి పెట్టారు. గురువారం రాత్రి నుంచి అన్ని మెట్రో స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2,078 మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు అధికారుల చెప్పారు. అదనంగా మెట్రోరైలు సిబ్బంది సేవలను కూడా వాడుకుంటున్నారు.
శుక్రవారం ఉదయం నుంచి అగ్నిమాపక శాఖ అధికారులు మెట్రో రైల్వేస్టేషన్లలో అగ్నిప్రమాదాలు-నివారణపై దృష్టి పెట్టారు. అక్కడి సిబ్బందికి అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఎల్బి నగర్లో మెట్రో రైలు ప్రారంభమై మియాపూర్ చేరుకునే మార్గం ఒక్కటి కాగా, నాగోల్ నుంచి మియాపూర్ వరకు సాగుతుంది.
మెట్రో సిబ్బంది
పోలీసులు మెట్రో సిబ్బందికి భద్రతా పరికరాల వినియోగం, ప్రయాణికులు, లగేజీ పరిశీలనపై శిక్షణ ఇస్తున్నారు. శనివారం ఉదయం కొన్ని రైల్వే స్టేషన్లలో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేసారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా డీజీపీ పర్యవేక్షణంలో ఏర్పడిన సమన్వయ కమిటీ సభ్యులు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, ట్రాఫిక్ విభాగం అదనపు సీపీలు పర్యవేక్షిస్తున్నారు.
రెండు కమాండ్ సెంటర్లు
మెట్రో భద్రతపై మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టి పెట్టారు. నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల మార్గంలో ఉన్న 24 మెట్రో స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13, సైబరాబాద్లో 8, రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు స్టేషన్లు ఉన్నాయి.
సిసి కెమెరాల అనుసంధానం...
అన్ని స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానిస్తూ నాగోల్, మియాపూర్లో రెండు కమాండ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి అన్ని స్టేషన్లను పరిశీలిస్తారు. ఉన్నతాధికారులు కంట్రోల్ రూంలను పరిశీలించారు. ప్రతి స్టేషన్లో ఓ లోకల్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. స్టేషన్లోని దాదాపు 60 సీసీ కెమెరాలు, 360 డిగ్రీలు తిరిగే హెచ్డీ సీసీ కెమెరాలు, స్కానర్లు, మెటల్ డిటెక్టర్లను అనుసంధానించారు.
నిరంతర నిఘా...
కంట్రోల్ రూం ద్వారా స్టేషన్ ఆవరణ, రైల్వే ట్రాక్, చుట్టుపక్కల పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తారు. ఇందుకు సంబంధించి శుక్రవారం అన్ని స్టేషన్లలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రయాణికుల మార్గాలు, స్టేషన్ ఆవరణ, ప్లాట్ఫాం, ట్రాక్ను కమాండ్ రూం నుంచి సీసీ కెమెరాల సహాయంతో పరిశీలించారు. మెటల్ డిటెక్టర్లు, స్కానర్ల పనితీరును కూడా పరిశీలించారు.
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు
మెట్రో స్టేషన్ల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. 30 కిలోమీటర్ల మెట్రో మార్గంలో 20 జంక్షన్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నదని అధికారులు తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధాన రోడ్ల గుండా మెట్రోరైలు వెళ్తుండడంతో రోడ్డుపై వెళ్లే ప్రజలు వింతగా చూస్తారని, దీంతో ట్రాఫిక్ సమస్య, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.