తీగ తెగి, కరెంట్ లేక ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు: ప్రయాణీకుల ఆసహనం
హైదరాబాద్: సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైళ్లు శనివారం మధ్యాహ్నం వరకు ఆలస్యంగా నడిచాయి. ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. కూకట్పల్లి వద్ద ఓవర్ హెడ్ విద్యుత్ ట్రాక్షన్ లైను తెగింది. దీంతో బాలానగర్ స్టేషన్ వద్ద మెట్రో రైలు నిలిచిపోయింది.
దాదాపు మూడున్నర గంటలకు పైగా సర్వీసులు ఆగిపోయాయి. ఎవర్ హెడ్ ఎక్విప్మెంట్లో వైరు తెగడంతో సమస్య తలెత్తిందని మెట్రో రైలు తెలిపింది. శనివారం ఉదయం గం.9.57 నిమిషాల నుంచి మధ్యాహ్నం గం.1.20 నిమిషాల వరకు అంతరాయం ఏర్పడింది.
ట్రాక్ పై ఓవర్ హెడ్ విద్యుత్ ట్రాక్షన్ లైన్ తెగింది
శనివారం ఉదయం కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీ మార్గంలోని 28వ నెంబర్ మెట్రో స్తంభం వద్ద ట్రాక్ పైనున్న ఓవర్ హెడ్ విద్యుత్తు ట్రాక్షన్ లైను తెగిపోయింది. దీంతో విద్యుత్తు సరఫరా నిలిచింది. వెంటనే ఈ మార్గంలో వెళుతున్న మెట్రో రైలును బాలానగర్ స్టేషన్లో ఆపివేశారు.
ఆలస్యంగా నడిచిన రైళ్లు
ఈ కారణంగా కారిడార్ 1లో పలు మెట్రో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. స్టేషన్లలో రైళ్లను ఎక్కువసేపు ఆపుతూ నడిపారు. మియాపూర్- ఎల్బీ నగర్ వైపు అరగంటపాటు సర్వీసులు నిలిచాయి. ఆ తర్వాత మూసాపేట నుంచి మియాపూర్ వరకు పూర్తిగా నిలిపేశారు. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వచ్చే మెట్రో రైళ్లను మూసాపేట వరకే పరిమితం చేశారు.
రైళ్లు నిలిపేశారు
ఆ తర్వాత సర్వీసులను నిలిపేశారు. ఉదయం, మధ్యాహ్నం వేళలు కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమీపంలోని మూసాపేటలో స్ల్పిట్ రివర్సల్ ఉంది. దీంతో ఎల్బీ నగర్ నుంచి మూసాపేట సర్వీసులు నడిచాయి. అమీర్పేటలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో కొన్ని సర్వీసులను మూసాపేట వరకు తిప్పారు.
ఆలస్యానికి కారణం తెలియక అసహనం
విషయం తెలియగానే మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం సర్వీసులను పునరుద్ధరించారు. కార్యాలయాలకు వెళ్లే సమయం, పండుగ సెలవులు, షాపింగ్ కోసం వెళ్లేవారి రద్దీ కారణంగా ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఆలస్యానికి కారణం తెలియక ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేశారు. కొందరికి డబ్బులు తిరిగి ఇచ్చారు.