గుడ్ న్యూస్ : డిసెంబర్లో మెట్రో రైలు పాసుల జారీ...ఆర్టీసీతో పాసుల అనుసంధానం
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు ఒక శుభవార్త. త్వరలోనే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పాస్ జారీ చేయనుంది. ఈ ప్రక్రియ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. నెల పాసుల జారీ విషయమై సమాలోచనలు చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎల్ అండ్ టీ యాజమాన్యాన్ని కోరింది. ఈ మెట్రో పాస్ కామన్ మొబిలిటీ కార్డుతో అనుసంధానం అవుతుంది. అంటే ఈ పాస్ ఆర్టీసీతో పాటు ఇతర ప్రజారవాణా వ్యవస్థలకు కూడా వినియోగించొచ్చు.
సరసమైన ధరకే మెట్రో రైల్ పాస్
" మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు నెల వారీ పాసుల జారీ అంశాన్ని పరిశీలిస్తున్నాము. ఈ పాసులను సరసమైన ధరకే అందించాలని యోచిస్తున్నాము. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. మెట్రో ఆర్టీసీతో అనుసంధానం అయ్యేలా పాసులు తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం స్మార్ట్ కార్డే పాసులా పనిచేస్తుంది. త్వరతగతిని గ్రౌండ్ వర్క్ చేసి ఒక మంచి నిర్ణయంతో ముందుకు రావాలని ఎల్ &టీని కోరాం" అని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ క్యాబ్ సర్వీసులతో పాస్ అనుసంధానం
ఇక మెట్రో రైలు దిగగానే ఆర్టీసీబస్సుల్లో ప్రయాణించేందుకు ఎల్&టీ హెదరాబాద్ మెట్రో రైల్ సంయుక్తంగా ఒక కామన్ టికెటింగ్ మెకానిజంతో ముందుకు రావాలని యోచిస్తున్నాం. కామన్ మొబిలిటీ కార్డులు జారీ చేసేందుకు ఇప్పటికే ఎల్&టీ మెట్రోరైలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. రవాణా వ్యవస్థలో సదుపాయాల కల్పన విషయమై ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో స్మార్ట్ టికెటింగ్ వ్యవస్థపై ఆర్టీసీ మెట్రోరైల్ కలిసి చర్చించడమే కాదు డెమో కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక్క ప్రజారవాణా వ్యవస్థకే కాదు ప్రైవేట్ కంపెనీలైన ఊబెర్, ఓలా సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతాయని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.
అమీర్పేట్ ఎల్బీనగర్ రూట్లో పెరిగిన ప్రయాణికుల రద్దీ
డిసెంబరులోగా నెలవారీ పాసుల జారీపై ఒక తీర్మానం చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. స్మార్ట్ కార్డులు జారీ చేయడం వెనక చాలా పని ఉంటుందని చెప్పిన ఎన్వీఎస్ రెడ్డి.... చెన్నై మెట్రోలో ఒక పరిష్కారం కనుగొనేందుకు ఐదేళ్ల సమయం పట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు చెన్నై మెట్రోలో త్వరలో స్మార్ట్ కార్డ్ విధానం ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. అయితే అక్కడ మెట్రో రైలు ఆర్టీసీ సేవలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందన్నారు. ఇక బెంగళూరు నమ్మ మెట్రోలో స్మార్ట్ కార్డు విధానం ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇక ఢిల్లీలో ఈ ఏడాది మొదట్లో స్మార్ట్ కార్డు ప్రవేశపెట్టారని అది ఆర్టీసీ బస్సులతో అనుసంధానం అయ్యిందని చెప్పారు. అయితే ప్రైవేట్ క్యాబ్ సర్వీసులతో మాత్రం అనుసంధానం కాలేదని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పాటైన అమీర్ పేట్ - ఎల్బీనగర్ రూట్లో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిందని అన్నారు ఎన్వీఎస్ రెడ్డి.