మెట్రో రైలుకు గిరాకీ: రెండు రోజుల్లోనే వేల స్మార్ట్ కార్డులు
Recommended Video
హైదరాబాద్: మెట్రో రైలుపై హైదరాబాద్ నగరవాసులు ఎనలేని ఆసక్తి చూపుతున్నారు. మెట్రో రైలును మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నుంచి అది ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.
మెట్రో రైలు ప్రాజెక్టును తమ ప్రభుత్వ హయాంలో చేపడితే అంతా తానే చేశానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గొప్పలు చెబుకుంటున్నారని కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే, కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో 15 శాతం పనులు మాత్రమే జరిగాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు అంటున్నారు.
విమర్శలతో సంబంధం లేకుండా...
పార్టీల విమర్శలను, ప్రతి విమర్శలను పట్టించుకోకుండా నగరవాసులు మాత్రం మెట్రో రైల్లో తిరగడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. గత రెండు రోజుల్లో అధికారులు 7 వేల స్మార్ట్ కార్డులు విక్రయించారు. ఈ స్పందన ఎల్ అండ్ టీ హైదరాబాద్ రైల్ హైదరాబాద్ లిమిటెడ్ అధికారులకు ఉత్సాహాన్ని నింపుతోంది.
నాలుగు స్టేషన్లలో...
ప్రస్తుతం స్మార్ట్ కార్డులను నాలుగు రైల్వే స్టేషన్లలోనే విక్రయిస్తున్నారు. నాగోల్, తార్నాకా, ప్రకాష్ నగర్, ఎస్ఆర్ నగర్ స్టేషన్లలో వాటిని అమ్ముతున్నారు. ప్రారంభం రోజున ఎల్ అండ్ టీ మెట్రో రైల్ 5 శాతం డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ఒక్కో స్మార్ట్ కార్డు ధర రూ.200. వాటిలో రూ. 100 కార్డు సెక్యూరిటీ డిపాజిట్. అత్యధిక ధర రూ.3 వేలు ఉంది. కొనుగోలు చేసిన రోజు నుంచి ఏడాది పాటు కార్డు చెల్లుబాటు అవుతుంది.
కార్డు వాడితే...
కార్డు వాడితే సొమ్మును డిడక్ట్ చేస్తారు. నగదు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాలిడిటీ కొనసాగుగతుందని అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు కార్డును వాడకపోయినా సిస్టంలో అది ఉంటుంది.
29వ తేదీన్నే....
మెట్రో రైలులో ఎప్పుడెప్పుడు ప్రయాణిద్దామా అని ఎదురు చూస్తున్న హైదారాబాదు నగర వాసుల కల ఈ నెల 29వ తేదీన సాకారం కాబోతోంది. మొత్తం మీద ఎన్నో అవాంతరాల మధ్య, వివాదాల మధ్య మెట్రో రైలు కూత పెడుతోంది.